హుజూరాబాద్: దళితబంధు దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇది దేశానికే దిక్సూచిగా మారుతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 13 వార్డు దళితవాడతోపాటు పలు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలసి మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు.
దళితులకు మట్టి నుంచి బంగారం తీసే శక్తి ఉన్నదని, కానీ వాళ్ల దగ్గర డబ్బులు లేవని గుర్తించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గంగుల వివరించారు. దళితబంధును సింగిల్ సీమ్గా కాకుండా బహుళ ప్రయోజనాలు ఇచ్చే పథకంగా చూడాలని చెప్పారు. ఈ పథకంలో రీ పేమెంట్ లేదని, మధ్యవర్తి లేడని, ఇష్టమున్న వ్యాపారం చేసుకోవచ్చని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
దళితులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ఎంతో దోహద పడుతుందని ఆయన వివరించారు. దళితబంధు తీసుకునేటోళ్లకు రైతుబంధు, రైతుబీమా కట్ అవుతాయని కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల తోపాటు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మేయర్ సునిల్రావు, ఆయా వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.