జహీరాబాద్, డిసెంబర్ 29 : ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేసిన మహ్మద్ ఫరీదుద్దీన్ గుండెపోటుతో బుధవారం హైదరాబాద్లో మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను, కుటుంబీకులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. ఫరీదుద్దీన్కు లివర్ సమస్య ఉందని వైద్యులు గుర్తించి, ఆపరేషన్ చేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఫరీదుద్దీన్కు బుధవారం సాయంత్రం గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు పార్టీ నాయకులు, కుటుంబీకులు తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు, హోంమంత్రి మహమూద్ అలీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ దవాఖానకు వెళ్లి, కుటుంబీకులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ జహీరాబాద్ మండలంలోని హోతి(బీ) గ్రామంలో 14అక్టోబర్ 1957లో జన్మించారు. ఆయనకు భార్య ఫాతిమ్మున్సిసాబేగం, కొడుకు తన్వీర్ అహ్మద్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. హోతి(బీ) సర్పంచ్గా 1984లో పని చేశారు. జహీరాబాద్ మండలంలోని ఇప్పెపల్లి సహకార సంఘం చైర్మన్గా ఉన్నారు. 1999లో జహీరాబాద్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున గెలుపొంది 2009 వరకు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ ప్ర భుత్వం 2016 అక్టోబర్లో ఎమ్మెల్సీగా ఎన్నిక చేసింది. ఎమ్మెల్సీగా 3జూన్ 2021 వరకు పని చేశారు.
జహీరాబాద్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి..
జహీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. టీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి బలోపేత్తం చేసేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. కాంగ్రెస్లో ఉన్న తన అనుచురులను టీఆర్ఎస్లో చేర్పించుకున్నారు. టీఆర్ఎస్ను నియోజకవర్గంలో తిరుగులేని పార్టీగా అభివృద్ధి చేశారు. జహీరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు..
మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అంత్యక్రియలు జహీరాబాద్ మండలంలోని హోతి(బి) గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పార్థీవదేహాన్ని ఉద యం 10 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో ఉంచనున్నట్లు చెప్పారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచి, సాయంత్రం 3 గంటలకు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
ఫరీదుద్దీన్ మృతి పార్టీకి తీరని లోటు.. –మంత్రి హరీశ్రావు
మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి హరీశ్రావు అన్నారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆ యన కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఫరీదుద్దీన్ చేసి సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. మెదక్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పని చేసిన అనుభవాన్ని గుర్తు చేశారు. ఫరీదుద్దీన్ చేసి సేవలు మరువలేనివని అన్నారు.
అభివృద్ధిలో తనదైన పాత్ర.. -ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
మెదక్, డిసెంబర్ 29 : మాజీ మంత్రి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గుండెపోటుతో మృతి చెందడంతో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఫరీదుద్దీన్ విశేషమైన సేవలు అందించారని, మెదక్ జిల్లా అభివృద్ధిలో తనదైన పాత్ర వహించారని గుర్తు చేసుకున్నారు. మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఫరీదుద్దీన్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంచి నాయకుడిని కోల్పోయాం -పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు, డిసెంబర్ 29 : తెలంగాణ రాష్ట్రం మంచి నాయకుడిని కోల్పోయిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఫరీదుద్దీన్ మంత్రిగా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో ఉండేవారని తెలిపారు. సర్పంచ్గా ప్రస్థానం మొదలు పెట్టి రాష్ట్ర మం త్రిగా ఎదిగిన గొప్ప నాయకుడు ఫరీదుద్దీన్ అని అన్నారు. అభివృద్ధిలో ఫరీదుద్దీన్ పాత్ర మరువలేనిదనన్నారు.
మంచి మనిషి ఫరీదుద్దీన్.. -అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
అందోల్, డిసెంబర్ 29 : మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫరీదుద్దీన్ మృతి పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే మంచి మనిషి మన మధ్యలేకపోవడం బాధాకారమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.