తొర్రూరు, జూలై 26 : గత 2, 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. భారీ వర్షాలకు అలుగు పోస్తున్న తొర్రూరు, కంటాయపాలెం, గుర్తూరు చెరువులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పరంగా అన్నిచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మొన్నటి దాకా వర్షం రాక కాలం ఏమవుతుందనో అని బాధపడినం అన్నారు. కానీ, వరుణుడు కరుణించి గత 5 రోజులుగా వాన పడుతుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. విస్తారమైన వర్షాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రైతులకు సాగు కష్టాలు తప్పినట్లేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.