ములుగు : మేడారంలో ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఆదివారం మేడారం గ్రామంలోని సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో ములుగు సమీపంలో ఉన్న శ్రీ గట్టమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అయన తెలిపారు.
మేడారం జాతరను సందర్శించే ముందు మార్గమధ్యంలో ఉన్న గట్టమ్మ తల్లిని ముందుగా సందర్శిస్తారని మంత్రి తెలిపారు.
గట్టమ్మ తల్లి దేవాలయ దర్శనంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యలు కల్పించామని ఆయన తెలిపారు. అంతకుముందు పూజారులు ఆలయ అధికారులు మంత్రి దయాకర్ రావుకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలు మంత్రికి అందజేశారు.