హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరో సారి రుజువైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. దేశ సమాఖ్య స్ఫూర్తికి మోదీ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకం. ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయిందని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణపై బీజేపీకి మోదీకి ఎందుకంత అక్కసు? అని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విభజనకు మీరు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలు అమలు చేయడం లేదా?
ఏ విభజన స్ఫూర్తితో లోయర్ సీలేరు ప్రాజెక్ట్ సహా, ఏడు మండలాలను ఆనాడు ఆంధ్ర లో కలిపారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? బీజేపీ నిజ స్వరూపం ఇదే అని మరోసారి చాటి చెప్పారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.