వరంగల్: మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవం ద్విసప్తాహ వేడుకలలో భాగంగా శనివారం వరంగల్ మహా నగరపాలక సంస్థ ఆవరణలో జిడబ్లుఎంసి ప్రాంగణంలో రూ.10.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అశోక స్థూపాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలను మంత్రి ప్రారంభించారు. వీటిలో మెప్మా, ఐసిడిఎస్ లకు చెందిన 150 మంది మహిళలు వేసిన ముగ్గులను మంత్రి పరిశీలించారు. స్వయంగా మంత్రి ఎర్రబెల్లి ముగ్గులు వేశారు. వేసిన కొన్ని ముగ్గులకు రంగులు అద్దారు. మంత్రితో పాటు కమిషనర్ ప్రావీణ్య కూడా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్, డిప్యూటీ మేయర్ రిజ్వాన శమీమ్ మసూద్, పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, బల్దియా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటా జెండా ఎగరవేయడంతోపాటు స్వతంత్ర పోరాటంలోని మహనీయుల త్యాగాలను స్మరించుకునే విధంగా పదిహేను రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించి స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తి, సమైక్యతా భావం, ప్రతి ఒక్కరిలో కలిగేలా ఈ ఉత్సవాలను నగరంతో పాటు ప్రతి మండలం, గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అహింసా మార్గంలో ఆనాడు గాంధీజీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్ సాధించిన భారత స్వతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందు ఉందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు ఇచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకంలో దేశంలోనే అధిక పని దినాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్, కాళేశ్వరం ప్రాజెక్టు చూసిన తర్వాత ప్రపంచంలోనే అద్భుతమైన నెంబర్ వన్ ప్రాజెక్ట్ అని కేంద్రం కితాబిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నది కానీ నిధులు మంజూరు చేయడం లేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మాత్యులు కేటిఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్గా ఉందన్నారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వరంగల్ మహానగర అభివృద్ధికి పాటుపడాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
రంగురంగుల ముగ్గులు కూడా సృజనాత్మక కళగా మంత్రి పేర్కొన్నారు. ముగ్గులు వేసిన మహిళలను మంత్రి అభినందించారు. అనంతరం వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు రంగోలి మరియు ఉత్తమ సేవలు అందించిన బల్దియా ఉద్యోగులకు మంత్రి దయాకరరావు, చీఫ్ విప్ వినాయభాస్కర్, మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ల చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బల్దియా అడిషనల్ కమిషనర్ రషీద్, సెక్రెటరీ లక్ష్మి, ఉప కమిషనర్ లు, మెప్మా పిడి బల్దియా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మెప్మా, ఆర్పిలు, సివోలు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.