ఖమ్మం, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి తాను సొంతంగా రూ.50 లక్షల సాయాన్ని అందిస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన ‘మన ఊరు – మన బడి’ సమీక్షలో మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం సీఎం చేస్తున్న కృషికి తనవంతుగా చేయూతనందిస్తానని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విదేశాల్లో ఉన్న ప్రముఖులు, ఇతర వ్యాపారవేత్తలను ఈ కార్యక్రమంలో సంఘటితం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ బృహత్తర కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. తాను ప్రకటించిన సాయాన్ని త్వరలోనే ఖమ్మం కలెక్టర్కు అందజేస్తానని మంత్రి తెలిపారు.