న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన మైండ్ట్రీ..వరంగల్లో ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే వరంగల్లో సైయెంట్, టెక్ మహీంద్రాలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయగా..తాజాగా ఈ జాబితాలోకి మైండ్ట్రీ చేరింది. గతంలోనే రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా వరంగల్లో మైండ్ట్రీ ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మైండ్ట్రీ సీఈవో, ఎండీ దేబాషిశ్ చటర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు.
క్యూ3 లాభం రూ.437 కోట్లు
డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.437.50 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.326.50 కోట్ల లాభంతో పోలిస్తే 34 శాతం అధికమని పేర్కొంది. గత త్రైమాసికానికిగాను రూ.2,750 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 31 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.