రాష్ట్రంలోని మిల్లర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని గంగుల నివాసంలో మంత్రిని మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా ప్రస్థుత పరిస్థితుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సరైన స్టోరేజీ స్పేస్ లేకపోవడం, నెలపాటు మిల్లింగ్ మూతపడడంతో వర్కర్స్ తరలిపోతున్నారని తెలిపారు. కొన్ని చోట్ల అరుబయట పోసిన ధాన్యం తడిసిపోతున్నదని మంత్రి ఎదుట మిల్లర్లు ఆవేదన వ్యక్తంచేశారు.
వారి సమస్యలను మంత్రి గంగుల కమలాకర్ సావధానంగా విన్నారు. మిల్లింగ్ సమస్యలపై ప్రభుత్వం నిరంతరం చర్చిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర రైతాంగంతో ముడిపడి ఉన్న ఈ సమస్యలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.