న్యూఢిల్లీ, జనవరి 20: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ చర్చ అంతా బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్.. ఈ పార్టీల చుట్టే నడుస్తున్నది. కానీ, ఈ పెద్ద పార్టీలతో పాటు రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలకం కానున్నాయి. చిన్న పార్టీలకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ వాటికి పట్టు ఉన్న స్థానాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించి పెద్ద పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. యూపీ అంటేనే కుల రాజకీయం. అందుకు తగ్గట్టే కులాలను బట్టి రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ కుల ఆధారిత పార్టీలు సొంతంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ పెద్ద పార్టీలకు మద్దతిచ్చి తమ ఓటు బ్యాంకును, సీట్లను వాటికి బదలాయించడం ద్వారా ప్రతీ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకొంటాయి. అందుకే పెద్ద రాజకీయ పార్టీలు కూడా చిన్న పార్టీలతో పొత్తుల కోసం వ్యూహాలు రచిస్తాయి.
రెండు పెద్ద కులాల మద్దతు ఉంటేనే..
యూపీలో గతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా దానికి కనీసం రెండు పెద్ద కులాల మద్దతు అవసరం. సమాజ్వాదీ పార్టీకి సహజంగానే యాదవుల మద్దతు ఉంది. నాన్ యాదవ్ ఓబీసీల్లో కూడా కొన్ని కులాలు పార్టీ వెంట ఉన్నాయి. బీఎస్పీకి దళితులు మొదటి నుంచి అండగా ఉంటున్నారు. ముస్లింలు కూడా ఈ పార్టీ వెంట ఉంటున్నారు. ముస్లింలు, నాన్ యాదవ్ ఓట్లు చీలిన ప్రతీసారి అధికారం కూడా చేతులు మారింది. అయితే, 2017లో బీజేపీ ఈ కుల రాజకీయాల స్థానంలో మత రాజకీయం మొదలుపెట్టింది. తద్వారా ఎస్పీ, బీఎస్పీల వ్యూహాలను ఎదుర్కొన్నది. ఇప్పుడు కూడా మతం పేరుతోనే ఓట్లను రాబట్టుకోవడానికి చూస్తున్నది. అందుకు తగినట్టుగానే ప్రచారం చేస్తున్నది.
పూర్వాంచల్లో రాజ్భర్లు
2017లో బీజేపీ మతంతో పాటు నాన్ యాదవ్ ఓబీసీ ఓట్లను రాబట్టుకోవడానికి సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), నిషాద్ పార్టీలతో పొత్తు పెట్టుకొన్నది. అయితే, 2019లో ఎస్బీఎస్పీ నేత ఓం ప్రకాశ్ రాజ్భర్ బీజేపీతో తెగదెంపులు చేసుకొన్నారు. ప్రస్తుతం ఓం ప్రకాశ్ రాజ్భర్ ఎస్పీతో పొత్తు పెట్టుకొన్నారు. పూర్వాంచల్లో రాజ్భర్లు గణనీయంగా ఉన్నారు. యాదవుల తర్వాత రాజకీయంగా ప్రభావం చూపగల అతిపెద్ద కులముగా దీన్ని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఎస్పీఎస్పీతో పొత్తు అఖిలేశ్కు చాలా మేలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్బీఎస్పీతో పాటు సమాజ్వాదీ పార్టీ మహాన్ దళ్, ఆరెల్డీతో పొత్తు పెట్టుకొన్నది. మహాన్ దళ్కు శాక్య, సైనీ, మౌర్య, కుశావహల్లో పట్టు ఉంది. ఆరెల్టీకి జాట్ రైతుల మద్దతు ఉన్నది.
కుర్మిలు, నిషాద్ పార్టీ, బ్రాహ్మణులు
అప్నాదళ్(ఎస్) నాయకురాలు అనుప్రియ పటేల్కు కుర్మిల్లో ఆదరణ ఉంది. నిషాద్ పార్టీకి జాలర్లలో మంచి పట్టు ఉంది. వీరు ఆరు లోక్సభ స్థానాల్లో ప్రభావం చూపగలరు. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నాయి.
యోగితో తలపడనున్న ఆజాద్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు పోటీగా గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) అధ్యక్షుడు, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ బరిలోకి దిగుతున్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. న్యాయవాది నుంచి రాజకీయ నేతగా మారిన ఆజాద్.. భీమ్ ఆర్మీ సంస్థ సహవ్యవస్థాపకుడు. దళిత హక్కుల కోసం ఆయన పోరాడుతున్నారు.
యోగికి పోటీగా ఎస్పీ నుంచి బ్రాహ్మణ అభ్యర్థి
లక్నో: గోరఖ్పూర్ అర్బన్ నుంచి బరిలోకి దిగనున్న సీఎం యోగి ఆదిత్యనాథ్కు చెక్ పెట్టేందుకు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన మరో నేతను బరిలోకి దించనున్నట్టు సమాచారం. బ్రాహ్మణ కమ్యూనిటీలో స్థానికంగా మంచి పట్టున్న దివంగత బీజేపీ నేత ఉపేంద్ర దత్ శుక్లా సతీమణికి గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ సీటు కేటాయించనున్నట్టు ఎస్పీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఆమె ఎస్పీ సీనియర్ నేతలతో భేటీ కావడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.