హైదరాబాద్ మహా నగరానికి మెట్రో రైలు మణి హారంగా మారింది. కాలుష్య రహిత ప్రయాణ సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థగా నిలిచింది. మెట్రోకు పెరుగుతున్న ఆదరణ, ప్రజావసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టింది. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు సుమారు 31 కిలో మీటర్ల మేర నిర్మించనున్న మార్గానికి నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
రోజు రోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగర ప్రయాణ అవసరాలకు మెట్రో రైలు తప్ప మరో మార్గం లేదని నిపుణులు సూచించారు. దాని ఫలితంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయిలో భారీ పబ్లిక్ ప్రైవేటు భాగ్వస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టుకు ప్రారంభం నుంచీ అద్భుతమైన స్పందన వస్తున్నది. 2017 నవంబర్ 29న సేవలు ప్రారంభించిన మొదటి రోజే 2 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారు. ఇది మెట్రో చరిత్రలో ఒక రికార్డు. ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్లలో 69 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గాలు విస్తరించాయి. నేడు ప్రతి రోజు 4 లక్షలకు పైగా ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాదీల్లో ఎక్కువ మంది కార్లను పక్కన పెట్టి మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్నారు. రద్దీ అధికంగా ఉండడంతో రైళ్ల సంఖ్య పెంచాలని, కొత్త మార్గాల్లో మెట్రో సౌకర్యం కల్పించాలని ప్రజల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇవాళ ప్రజా రవాణాలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తున్నది.2022 నవంబర్ 29 వరకు మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారు. నగరంలోని 7 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగుల్లో 30-40 శాతం మంది నిత్యం మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. వేగం, నిర్ణీత సమయంలో గమ్యానికి చేరడం, పర్యావరణ హితంగా ఉండటం వల్ల మెట్రోకు ఆదరణ పెరుగుతున్నది.
మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం ఎంతో భారమైనా ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలే ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ మేర మెట్రో మార్గాన్ని విస్తరిస్తున్నది. దీనికి సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు 8 కి.మీ మేర మెట్రోను పొడిగిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో పాటు బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మధ్య 26 కి.మీ, నాగోల్-ఎల్బీ నగర్ 5 కి.మీ, బీహెచ్ఈఎల్-పటాన్చెరువు 9 కి.మీ, ఫలక్నుమా-శంషాబాద్ విమానాశ్రయం 16 కి.మీ, తార్నాక-ఈసీఐఎల్-కీసర ఓఆర్ఆర్ 19 కి.మీ మేర మెట్రోను విస్తరించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందిస్తున్నది.
కాలుష్య రహిత ప్రయాణం
వాయు కాలుష్యం వల్ల నగరాలు నివాస యోగ్యం కావనే భావన ఏర్పడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్య రహిత ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైల్ నిలుస్తున్నది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు మార్గాలను విస్తరించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ పట్ల పర్యావరణ వేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థలను నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తే ఆయా నగరాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది.
శివార్లలో పట్టణీకరణ
మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ ప్రతిపాదనలు శివారు ప్రాంతాల దాకా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో పట్టణీకరణ శరవేగంగా పెరిగేందుకు అవకాశం కలుగుతుంది. ఏ పని చేసినా ఎంతో దూర దృష్టితో చేసే సీఎం కేసీఆర్ ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా మెట్రో మార్గాలను రూపొందిస్తున్నారు. అభివృద్ధి నగరంలోని ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఐటీ కారిడార్ కారణంగా పశ్చిమ జోన్ వైపు చాలా వేగవంతమైన అభివృద్ధి నెలకొనడంతో, మిగతా ప్రాంతాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు గ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. 2041 నాటికి హైదరాబాద్ మహా నగరంలో మొత్తం 204 కి.మీ మేర మెట్రో రైలు మార్గాలను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
మోనో రైలు, మెట్రో నియో పైనా అధ్యయనం
కేపీహెచ్బీ కాలనీ నుంచి మలేషియా టౌన్షిప్, హైటెక్ సిటీ, హైటెక్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట మీదుగా నార్సింగి ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను(ఈబీఆర్టీఎస్) రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు తరహాలోనే డిజైన్ చేసి నిర్మించనుంది. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోనో రైలు, మెట్రో నియో వంటి అత్యాధునిక ప్రజా రవాణా ప్రాజెక్టులను అధ్యయనం చేసి, వాటి కంటే మెరుగైన ప్రాజెక్టును హైదరాబాద్లో నిర్మించేందుకు హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ అర్బన్ మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఉమ్టా) సర్వేలు చేపట్టి, నివేదికలు రూపొందిస్తున్నది.
– బరిగెల శేఖర్
93925 62622