హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలను ఇగం గజగజ వణికిస్తున్నది. సాయంత్రం నుంచే చలి తీవ్రత మొదలై.. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు దట్టంగా కురుస్తున్నది. హైదరాబాద్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావం ఉత్తర తెలంగాణపై తీవ్రంగా ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వాతావరణశాఖ వద్ద 1980 నుంచి ఉన్న ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తే.. 2017 డిసెంబర్ 27న మాత్రమే అతి తక్కువగా 3.5 డిగ్రీలు నమోదైంది. తాజాగా మంగళవారం మరోసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జల్లా తిర్యాణి మండలం గిన్నెదరిలో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. సిర్పూర్(యూ), ఆదిలాబాద్ జిల్లా బేలలో 3.8, భీమ్పూర్ మండలం అర్లి(టీ)లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయినట్టు వెల్లడించింది.
చాలా జిల్లాల్లో పదిలోపే ఉష్ణోగ్రతలు
సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో మంగళవారం 10.6 నుంచి 11.8 డిగ్రీల మధ్య, మిగిలిన జిల్లాల్లో 9.7 నుంచి 3.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా హైదరాబాద్లో 10 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కావాలి.. కానీ ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో సింగిల్ డిజిట్కే పరిమితమైంది.
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యల్పంగా రాజేంద్రనగర్లో 8.4, శేరిలింగంపల్లిలో 8.8, రామచంద్రాపురంలో 9.1, సికింద్రాబాద్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంపై ఉత్తర గాలుల ప్రభావం తీవ్రంగా ఉన్నదని, ఈ నెల 27 వరకు ఉష్ణోగ్రతలు కాస్త అటు ఇటుగా తక్కువగానే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. కొద్ది రోజులు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగినా తిరిగి ఉష్ణోగ్రతలు బాగా తగ్గి జనవరి రెండోవారం వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. మరో మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.