ఎదులాపురం, మార్చి 19 : రిమ్స్ దవాఖానలో అధునాతన పరికరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సీజీఐ కార్పొరేట్ సంస్థ, బాల వికాస్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో రిమ్స్లో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను శనివారం కలెక్టర్ ప్రారంభించారు. సీజీఐ సంస్థ, బాల వికాస్ ఆధ్వర్యంలో అనస్తీషియా వర్క్ స్టేషన్, వెంటిలేటర్ తదితర పరికరాలు రిమ్స్లో ఏర్పాటు చేయడం అభినంనీయమన్నారు. ఈ వైద్య పరికరాల వినియోగంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆమె వైద్యులకు సూచించారు. జిల్లాలో కొవిడ్ సమయంలో ఈ సంస్థ ద్వారా కిట్లు, హ్యాండ్ వాష్ తదితర యూనిట్లను వివిధ పాఠశాలలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, సీజీఐ సంస్థ ప్రతినిధులు శౌరెడ్డి, నిర్భయ్ లుందే, వైద్యులు పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి స్వనిధి యోజనలో భాగంగా అర్హులైన వీధి వ్యాపారస్తులకు రుణాలు మంజూ రు చేశామని, ఇందుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద రుణాలు పొందిన వీధి వ్యాపారులను కేంద్ర ప్రతినిధులు పరిశీలించనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ముందస్తు సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రతినిధుల పర్యటనలో భాగంగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తమ గుర్తింపు కార్డులు, తదితర రుణ మంజూరుకు సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకునేలా అధికారులు వారికి తెలియజేయాలని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పరిసరాల శుభ్రతతో పాటు తాగునీరు, మొబైల్ టాయిలెట్స్, విద్యుత్ దీపాలు వంటి వసతులు కల్పించాలని సూచించారు. మెడికల్ క్యాంప్ నిర్వహించి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. రుణ పద్దులను సకాలంలో చెల్లించిన వారికి తదుపరి రుణం మంజూరు చేయడంతో వారి వ్యాపారం వృద్ధి చెందిందన్నారు. అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ, యువజన సంక్షేమ అధికా రి వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మెప్మా, డీఎంసీ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వరరా వు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ పాల్గొన్నారు.