మార్గదర్శకాలకు అనుగుణంగా మున్సిపాలిటీ , మున్సిపల్ కార్పొరేషన్ల సర్వసభ్య సమావేశాలు
మినిట్స్ ప్రతిని 24 గంటల్లో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్కు పంపాలి
మున్సిపల్శాఖ తాజా మార్గదర్శకాలు జారీ
ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 మున్సిపాలిటీలు
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 28: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సర్వసభ్య సమావేశాలను నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని ఈనెల 24వతేదీన మున్సిపల్శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మార్గదర్శకాలు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి అంశాలతో ముడిపడిన మున్సిపల్ సర్వసభ్య సమావేశాలపై ప్రజలకు చాలా ఆసక్తి ఉంటుంది. సమావేశాల్లో ఆర్థికపరమైన అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఉత్కంఠ నెలకొంటున్నది. సమావేశాల్లో పాలకవర్గ సభ్యులు ఏఅంశాలపై చర్చించారు..ఏ అంశాలను ఆమోదించారు, ఏ అంశాలను తిరస్కరించారనే అంశాలు నేటి వరకు ప్రజలకు తెలియడం లేదు. కొన్ని విషయాల్లో పాలకవర్గ సభ్యులు గోప్యత పాటించడంతో ఆర్థికపరమైన అంశాలు బయటకు రావడం లేదనే ఆరోపణలు సైతం ఉంటున్నాయి. ఎజెండాలో ఆమోదించిన అంశాలు ఇతర వివరాలను మున్సిపల్ మినిట్ బుక్లో నమోదు చేయాలన్న నిబంధన ఉన్నది. ఈ విషయాలు పాలకవర్గం సభ్యులకు పూర్తిస్థాయిలో తెలియకపోవడంతో అవినీతికి తావిస్తున్నట్లు ప్రభుత్వం భావించింది. ఇక నుంచి అంశాలన్నీ కార్యాలయ నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంచనుండటంతో పాలకవర్గం ఎజెండా అంశాలు బహిర్గతం కానున్నాయి. నూతన మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి నెలా నిర్వహించే మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను 24 గంటల్లో బహిర్గత పర్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు ఆమోదించే అంశాలు,తిరస్కరించిన వివరాలు ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
విధిగా నమోదు చేయాలి..
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించి తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ బుక్లో విధిగా నమోదు చేయాలి. 24 గంటల్లో చైర్మన్, కమిషనర్ సంతకాలతో కలెక్టర్, అదనపు కలెక్టర్కు (స్థానిక సంస్థలు) పంపించాలి. అంతేకాకుండా సీడీఎం కార్యాలయానికి ప్రతులు పంపాలి. పాలకవర్గ సభ్యులు ఎజెండాలోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, డిసెంట్ నోటీసులు ఇచ్చినా ఆ వివరాలను 48 గంటల్లోగా కలెక్టర్కు నివేదించాలి. వాటిని క్షణ్ణంగా పరిశీలించి ఆమోదించాలా.. తిరస్కరించాలా అనే నిర్ణయాన్ని కలెక్టర్కు అప్పగిస్తూ మున్సిపల్శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి నెలకోసారి కౌన్సిల్ సమావేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
నోటీసు బోర్డుపై అందుబాటులో వివరాలు..
మన్సిపల్ సర్వసభ్య సమావేశాలకు సంబంధించి ఎజెండాలోని అంశాలను మున్సిపల్ నోటీస్ బోర్డుపై అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సమావేశంలో ఆమోదించిన అంశాలను సైతం నోటీసు బోర్డులో ఉంచాలని పేర్కొన్నది. దీంతో ఎజెండాలోని అంశాలన్నీ ప్రజలకు బహిర్గతం కానున్నాయి.
ఆదేశాలు పాటిస్తాం
డీఎంఏ నుంచి జారీ చేసిన ఆదేశాలు విధిగా పాటిస్తాం. నోటీసు బోర్డుపై ఎజెండాలో ఆమోదించిన, తిరస్కరించిన అంశాలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటాం
-శ్రీహరి, మెదక్ మున్సిపల్ కమిషనర్
స్వాగతిస్తున్నాం..
ప్రభుత్వం సూచించిన ప్రకారమే నడుచుకుంటాం. ప్రతి నెలా సమావేశం వివరాలను పట్టణ ప్రజలకు తెలిసేలా నోటీసు బోర్డుపై ఉంచుతాం. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను స్వాగతిస్తున్నాం.
-చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్