సిద్దిపేట అర్బన్, జూలై 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వర్షాలు, వరద, జిల్లా ప్రగతి, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డితో కలిసి సమీక్షించి మాట్లాడారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 181 చెరువులు నిండగా, 131 చెరువులు మత్తడి దూకుతున్నాయని వెల్లడించారు. జిల్లాలో 534 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, సిద్దిపేట డివిజన్లో 326, గజ్వేల్ డివిజన్లో 154, హుస్నాబాద్ డివిజన్లో 54 ఇండ్లు ఉన్నాయన్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
శ్రావణ మాసంలో గృహప్రవేశాలు
జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారం (శ్రావణ మాసం)లో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాల్లో 435 నూతన గృహ ప్రవేశాలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవోకు మంత్రి సూచించారు. డిసెంబర్ నెలాఖరులోగా గజ్వేల్ రింగ్రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆర్అండ్బీ ఈఈ సుదర్శన్రెడ్డిని ఆదేశించారు. ఆర్అండ్బీ అధికారులతో చర్చించి, అసంపూర్తి పనుల పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. ఎలాంటి అవాంతరాలు, కోర్టు కేసులు లేకుండా భూసేకరణ చేపట్టడమే కాకుండా దేశంలోనే తొలిసారి అతి వేగంగా కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ ప్రాజెక్ట్ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట-దుద్దెడ రైల్వేలైన్ పనులు త్వరితగతిన చేపట్టాలని రైల్వేశాఖ అధికారులను ఫోన్లో ఆదేశించారు. దుద్దెడ-సిద్దిపేట రైల్వేలైన్ నిర్మాణంలో ప్రత్యేక చొరవ చూపాలని, రైల్వే అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించాలని కలెక్టర్ను కోరారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు, పురోగతిపై రైల్వే అధికారులను మంత్రి ఫోన్లో ఆరా తీశారు.