రామాయంపేట రూరల్, మార్చి 22 : రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపుతున్నారు. విభిన్న రకాలుగా నూతన విధానాలతో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఓ రైతు నూతన విధాన వ్యవసాయంతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతు ప్రభులింగం.. తనకున్న 8 ఎకరాల వ్యవసాయ భూమిలో ఒకే రకం పంట వేయకుండా రెండు ఎకరాల్లో వేరు శనగ, ఆస్ట్రేలియా టేకు, వరి, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నాడు. వీటికి డ్రిప్ సిస్టం ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటలతో కూడా అనేక లాభాలు ఉన్నాయని, అంతే కాకుండా భూసారం పెరుగుతుందని రైతు ప్రభులింగం చెప్పుకొచ్చారు. రైతులకు కూడా ఒకే రకం పంట వేయడం వల్ల లాభాలు కూడా తగ్గుతాయని తెలిపారు.
రెండు ఎకరాల్లో వేరు శనగ పంట..
ప్రభులింగం రైతు.. రెండు ఎకరాల్లో వేరు శనగ వేశారు. దీనికి నీటి వినియోగం కూడా తక్కువగా అవసరముంటుంది.120 రోజుల్లో వేరుశనగ చేతికి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకు మంచి డిమాండ్ ఉన్నది. ఇతర పంటల మాదిరిగానే పంట కాలం ఉన్నప్పటికీ వాటికి రెట్టింపు ధర వేరుశనగకు వస్తుందని అన్నారు.
ఆస్ట్రేలియా లేక్కు మంచి డిమాండ్..
రైతు ప్రభులింగం సాగు చేస్తున్న ఆస్ట్రేలియా లేక్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులు అంటున్నారు. అయితే ఈ టేకు 10 ఏండ్లకు చేతికి వస్తుంది. దీంట్లో ఇంతర పంట లు సాగు చేసుకునే అవకాశం ఉన్నది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండ వని అధికారులు చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఈ టేకు మొక్కల మధ్యలో అంత ర పంటగా వేరుశనగ, ఇతర పంటలను రైతు సాగుచేస్తున్నాడు.
ప్రత్యామ్నాయం మంచిదే..
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం మంచిదే. అయితే మనం లాభదాయక పంటల సాగు చేయడంపై అవగాహన కలిగి ఉండాలి. తక్కువ నీరు, పెట్టుబడితో ఎక్కువ సాగు, లాభాలు వచ్చే పంటలు ఎన్నో ఉన్నాయి. పంట మార్పిడితో భూసారం పెరుగుతుంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సంబంధిత అధికారులతో రైతులకు అవగాహన కల్పించాలి. రసాయనేతర పంటల సాగుపై ప్రభుత్వం రైతులకు పాడి పశువులు అందిస్తే.. పశుసంపద పెరగడంతో పాటు రసాయనేతర పంటల సాగు జరుగుతుంది.
-ప్రభులింగం, రైతు