షాబాద్, వికారాబాద్, కరీంనగర్ నెట్వర్క్, మార్చి 14: ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం.. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అడ్డంకులు ఎన్నో. అయినా అందరి లక్ష్యం సర్కారు నౌకరి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివారు. కోచింగ్కు వెళ్లిన వారు కొందరైతే..ఇంట్లోనే పుస్తకాలతో కుస్తీ పట్టిన వారు మరికొందరు. నిద్ర తగ్గించుకుని, ప్రణాళికాబద్ధంగా చదివారు. మొత్తానికి మంచి మెరిట్ సాధించి.. ప్రభుత్వ ఉద్యోగాన్ని పట్టుకున్నారు. కష్టాలు ఎప్పటికీ ఉండవు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు అని చెబుతున్న విజేతలతో నమస్తే తెలంగాణ మాటామంతి..
కానిస్టేబుల్గా పనిచేస్తూనే.. ఎస్ఐగా ఎంపికయ్యా..
మాది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటపల్లి. పెద్దగా భూమి జాగల్లేవు. అక్క, అన్న, నేను చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోనే పెరిగాం. మా అన్న అమరేందర్రెడ్డి చదువు మానేసి నన్ను బీకామ్ వరకు చదివిపించాడు. కాలేజీ, హాస్టల్, ఇతర అవసరాలన్నీ అన్ననే చెల్లించేది. సీఏ చేయాలనుకున్నా.. కానీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వీలు కాలేదు. ఈ కష్టాలు పోవాలంటే సర్కారు నౌకరి కొట్టడమే శరణ్యమనుకున్నా. 2017లో పోలీస్ రిక్రూట్మెంట్లో భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. రెండేండ్లు హైదరాబాద్లో ఆక్టోపస్లో పనిచేశా. 2018 నోటిఫికేషన్ కోసం మళ్లీ ప్రిపేరయ్యా. భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్ మెటీరియల్తోనే ఇంటి వద్దే చదువుకున్నా.. ఫిజికల్ ఈవెంట్లపై ఎక్కువ స్కోర్ చేసేందుకు ప్రయత్నించా. ఏఆర్ విభాగంలో ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యా. ఇపుడు జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్నా.
– మిట్టపెల్లి వినోద్రెడ్డి, ఏఆర్ ఎస్ఐ (జగిత్యాల హెడ్ క్వార్టర్స్)
ఉ.3గంటలకే నిద్రలేచి.. పట్టుదలతో చదివా..
మాది రంగారెడ్డిజిల్లాలోని తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామం. పదో తరగతి వరకు మా ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ వరకు కర్నూల్ సిల్వర్ జూబ్లీ కళాశాలలో పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకే హైదరాబాద్కు వచ్చాను. అశోక్నగర్లో ఉంటూ ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేరయ్యా. ప్రతి రోజు ఉదయం 3 గంటలకే నిద్రలేచేవాడిని. పట్టుదలతో చదివి 2014లో ఎస్ఐ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం చేవెళ్ల పోలీస్స్టేషన్లో ఎస్ఐగా పని చేస్తున్నాను.
– అబ్దుల్ హయ్యం, ఎస్ఐ చేవెళ్ల
కోచింగ్కు వెళ్లా.. నోట్స్ రాసుకున్నా..
మేం ప్రస్తుతం గోదావరిఖనిలో ఉంటున్నాం. మా నాన్న కందుల మల్లేశ్ది మంచిర్యాల జిల్లా మందమర్రి. గోదావరిఖని ఆర్జీ-3 ఏఎల్పీలో బెల్ట్ ఆపరేటర్గా పని చేస్తున్నారు. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నేను బీటెక్ చదివాను. సివిల్స్ రాయాలని ప్రిపేరయ్యా. 2015 నోటిఫికేషన్లో జాబ్ రాలేదు. దాంతో మరింత కష్టపడి చదివా. యూనిక్ స్టడీ సర్కిల్లో చేరా… సార్ వాళ్లు మంచిగా గైడ్ చేశారు. క్లాస్లు విన్న తరువాత సొంతంగా నోట్స్ తయారుచేసుకున్న. ఉద్యోగం కోసం పట్టుదలతో ప్రిపేరయ్యా. 2020లో ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. పైరవీలతో ఉద్యోగం రాదు.. పట్టుదలతో చదివితే తప్పకుండా అనుకున్నది సాధించవచ్చు.
– కందుల రాణి, మహిళా ఎస్ఐ, మంథని పెద్దపల్లి జిల్లా
చదివింది.. రాయాలి..ఆపై చర్చించాలి..
మాది జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపెల్లి. 2001లో నిర్వహించిన డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాను. పదిహేనేండ్లు ఉపాధ్యాయుడిగా పని చేశాను. ఉన్నత స్థానం చేరుకోవాలనే ఆకాంక్షతో గ్రూప్-2కు సన్నద్ధమయ్యా. రోజుకు 10 గంటలు చదివేవాడిని. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో ప్రణాళిక చేసుకున్నా. సమాచారం కోసం ఎక్కువగా ఇంటర్నెట్ శోధన, కరెంట్ అఫైర్స్ ఫాలో కావడం, దిన పత్రికలు క్షుణ్ణంగా చదవడం బాగా కలిసొచ్చింది. స్నేహితులు, సీనియర్స్ సలహాలు పయోగపడ్డాయి. నిరంతరం చదవడం, తర్వాత వాటిని రాయడం ద్వారా గుర్తుంచుకోవడం సులువైంది. చదివిన వాటిని చర్చించడం మంచి ఫలితాన్నిస్తుంది. పట్టుదలతో చదివి 2016 గ్రూప్-2 పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించి మొదటి ప్రయత్నంలోనే డిప్యూటీ తహసీల్దారు పోస్టుకు అర్హత సాధించాను. ప్రస్తుతం మంథనిలో డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాను.
– సిరిపురం గిరి, కుమ్మరిపెల్లి, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా
మా ఊరుకు బస్సులేదు..అద్దె ఇంట్లో ఉండి చదువుకున్నా..
మాది వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నర్సాపూర్ గ్రామం. మాకు వ్యవసాయమే జీవనాధారం. మా ఊరు నుంచి వికారాబాద్కు సరైన బస్సు సౌకర్యం ఉండేది కాదు. దాంతో మా చదువుల కోసం కుటుంబంతో పాటు వికారాబాద్కు వచ్చి అద్దెకు ఉన్నాం. మెదక్లో డిప్లొమా చేసి, హైదరాబాద్లో హాస్టల్లో ఉండి బీటెక్ చదివాను. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వికారాబాద్లోనే ఏకేఆర్ స్టడీ సర్కిల్లో కోచింగ్కు వెళ్లాను. కోచింగ్ సెంటర్ స్టడీ మెటీరియల్తో పాటు గణితం, ఇంగ్లిష్, ఇండియన్ చరిత్ర, తెలంగాణ చరిత్ర, పాలిటిక్స్, జీకే, తదితర పుస్తకాలు బాగా చదివాను. స్టడీ సర్కిల్ అధ్యాపకులు, నిర్వాహకులు సందేహాలను నివృత్తి చేసేవారు. 2019లో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో 96 మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం మోమిన్పేట పోలీస్స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాను.
– గొల్లమాధవి, కానిస్టేబుల్ మోమిన్పేట పీఎస్
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశా..ఎస్ఐ ఉద్యోగం సాధించా..
మాది రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కుంట్లూర్ గ్రామం. మా నాన్న చిన్నతనంలోనే మరణించాడు. అమ్మ ప్రొత్సాహంతో ఓయూలో ఎంసీఏ కంప్యూటర్స్ పూర్తి చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. 2012లో ఇబ్రహీం పట్నంకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడితో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే బాగుంటుంది అనుకున్నా. 2016లో ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నించాను. అప్పటికే సంవత్సరం బాబు ఉన్నాడు. బాబును భర్త, అత్తమామలు చూసుకునేవారు. 4,5 నెలలు హైదరాబాద్లోని ప్రైవేటు సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. 15 మార్కుల తేడాతో ఉద్యోగం చేజారిపోయింది. ఇంటి వద్దే ఉంటూ 2019లో మరోసారి ఎస్ఐ ఉద్యోగానికి సన్నద్ధం అయ్యాను. 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్, సైన్స్, జాగ్రఫీ పుస్తకాలు, తెలంగాణ, ఇండియన్ చరిత్ర, పాలిటిక్స్ వంటి వాటిని బాగా చదివాను. వీటితో పాటు రన్నింగ్, జంపింగ్, లాంగ్ జంప్ తదితర వాటిపై కూడా సాధన చేశాను. పురుషులతో సమానంగా కష్టపడ్డాను. ప్రస్తుతం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో మహిళా ఎస్ఐగా పని చేస్తున్నాను.
– గాలెగ్గి సరిత, వికారాబాద్ ఎస్ఐ