సిద్దిపేట రూరల్, జులై 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గొర్రె కాపరులు అప్రమత్తంగా ఉండాలని, గొర్రె, మేకలకు ఇది అత్యంత గడ్డు కాలమని జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ సూచించారు. గురువారం సిద్దిపేటలోని శ్రీకృష్ణ యాదవ సంఘంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా యాదవ నాయకులు మామిండ్ల ఐలయ్య యాదవ్, పయ్యావుల రాములుతో కలిసి మాట్లాడారు. వారం రోజులుగా వానలు పడుతున్నాయని, ఈ సమయంలో మందలు ఎత్తయిన ప్రాంతంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా గొర్ల దొడ్లకు సున్నం వేసి పొడిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం గొర్రెలకు అందించే వైద్యం, వ్యాక్సినేషన్ తదితర సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాలమల్లు, పత్తి వెంకటేశం, రాజబోయిన పరశురాములు, గోవిందగిరి స్వామి పాల్గొన్నారు.