మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 10 : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా ఈనెల 12న జాతీయ సాధన సర్వే(న్యాస్) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 3,5,8,10 తరగతులకు చెందిన 38.87 లక్షల మంది విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానాన్ని పరిక్షించనున్నారు. గతేడాది కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేకపోయారు. ఈసారి ప్రభుత్వ, ఎయిడెడ్తోపాటు ప్రైవేట్ పాఠశాలలను సైతం ఎంపిక చేశారు. తెలంగాణలో 4,936 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందులో మెదక్ జిల్లా నుంచి 132 పాఠశాలల నుంచి తరగతికి 30 మంది చొప్పున ఎంపిక చేసిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయనున్నారు. 4 తరగతులకు మాతృ భాష, గణితం, ఈవీఎస్ 8,10 తరగతులకు మాతృభాష, గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉండే ప్రశ్నపత్రాలు ఇస్తారు. 3,5 తరగతులకు గంటన్నర, మిగిలిన తరగతులకు 2 గంటల చొప్పున సమయం కేటాయించారు. ఓఎంఆర్ పత్రంలో జవాబులు గుర్తించాలి. సర్వే అనంతరం రాష్ర్టాలు, జిల్లాల వారీగా కేంద్రం సమగ్ర నివేదికలను విడుదల చేస్తుంది. ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో అందులో పొందుపరుస్తారు. ఆ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 12న జరిగే పరీక్షకు సీబీఎస్ఈ ఇప్పటికే తెలంగాణకు 53 మంది పరిశీలకులను నియమించింది. అంతేగాకుండా జిల్లా స్థాయిలో పర్యవేక్షణ అధికారులను, ఇన్విజిలేటర్లను నియమించారు.
విద్యార్థుల స్థాయిని గుర్తించడానికే పరీక్ష..
అభ్యాసన స్థాయిలను పరిక్షించడానికి న్యాస్ ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడం.. దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడుతాయి. జాతీయస్థాయి విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాల స్థాయి పరిశీలనకై నిర్వహించే న్యాస్ పరీక్షలతో విద్యార్థుల్లో అభ్యాసనాభివృద్ధి జరుగుతుంది.