హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బ్రేక్ తనిఖీ చేస్తుండగా బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ (39) మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
విధుల్లో భాగంగా బ్రేక్ సమస్య తలెత్తిన ఓ ఆర్టీసీ బస్సుకు సంతోష్ కుమార్ మంగళవారం ఉదయం మరమ్మతులు చేశాడు. రిపేర్ అనంతరం బస్సు కింద నుంచి సంతోష్ బయటకు వచ్చేలోపే డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాడు. దీంతో బస్సు చక్రాల కింద నలిగి సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.