శేరిలింగంపల్లి, మార్చి 25 : సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్ -1, 2 కాలనీల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న సమస్యలను వాటి శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో చర్చించినట్లు విప్ గాంధీ తెలిపారు. డ్రైనేజీ, ఔట్లెట్ సమస్యలతో పాటు తాగునీరు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను కాలనీ వాసులు విప్ అరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై వెంటనే స్పందించిన ఆయన అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వర్క్ఇన్స్పెక్టర్ మహేశ్, నాయకులు రాజు యాదవ్, పద్మారావు, కృష్ణ యాదవ్, రమేశ్, వేణుగోపాల్, గోపాల్, సెంట్రల్ పార్క్ కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్నగర్లో రూ. 40లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద ముంపు ప్రాంతాలను గుర్తించి సమస్యలు తలెత్తకుండా కాలువ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.