లక్నో : జైలు జీవితం గడుపుతున్న ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆ పార్టీని వీడతారనే ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయనకు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యానాధ్ నేతృత్వంలోని యూపీ బీజేపీ సర్కార్ ముస్లింలను వేధిస్తోందని మాయావతి దుయ్యబట్టారు. యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వేధిస్తున్నారని, వారు పాలకుల ఆగడాలకు బాధితులుగా బలవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
యూపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధుల పట్ల ద్వేషభావంతో అణిచివేత చర్యలకు పాల్పడుతోందని సీనియర్ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్ను రెండున్నరేండ్ల నుంచి జైలులో నిర్బంధించారని ఆమె ట్వీట్ చేశారు. ఆజంఖాన్కు మద్దతుగా మాయావతి మాట్లాడటం పలు ఊహాగానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ లోహియా అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ ఏప్రిల్లో సీతాపూర్ జైలులో ఆజం ఖాన్తో సమావేశమవడంతో వీరిద్దరూ ఎస్పీ చీఫ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నారు.
ఇక ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధరి రాంపూర్లో ఆజంఖాన్ భార్యతో పాటు ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ను కలిశారు. ముస్లింలపై వేధింపులు జరుగుతున్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నోరుమెదపడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీకి కాసిం రయిన్, సికిందర్ అలీ రాజీనామా చేశారు. ఆజం ఖాన్కు మద్దతుగా రాంపూర్కు చెందిన ఎస్పీ నేత నవీన్ శర్మ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఆజం ఖాన్ పలు అభియోగాలపై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 89 కేసులకు గాను 88 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది.