ఇటీవల ఫామ్ కోల్పోయి తంటాలుపడుతున్న టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ అనుభవం కలిగిన భువీ ఇలా బౌలింగ్ చేస్తే ఎలా..? అని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం అతడి బౌలింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసియా కప్తో పాటు ఆసీస్ తో తొలి టీ20లో.. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ ధారాళంగా పరుగులిచ్చిన భువనేశ్వర్కు ఇక నుంచి చివర్లో బంతిని ఇవ్వకుంటేనే బెటరనే విమర్శలూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భువనేశ్వర్కు ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ అండగా నిలిచాడు. రెండు మూడు మ్యాచ్లలో విఫలమైనంత మాత్రానా భువీని తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదని.. డెత్ ఓవర్లలో అతడు కీలక బౌలర్ అన్న విషయాన్ని మరువకూడదని తెలిపాడు.
హేడెన్ మాట్లాడుతూ.. ‘నేను దానికి (భువీకి డెత్ ఓవర్లలో బంతిని ఇవ్వొద్దు అన్న విమర్శలకు) అంగీకరించను. ఆఖరి ఓవర్లలో భువనేశ్వర్ కీలక బౌలర్. అతడు మంచి ఫినిషర్. అసలు జట్టులో భువీ పాత్ర కూడా అదే. తొలుత ఇన్నింగ్స్ ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక వికెట్లను తీయాలి. అయితే కెప్టెన్ అతడికి చివర్లో ఒకటి లేదా రెండు ఓవర్లు ఇస్తే ఆ పాత్రకూ న్యాయం చేయాలి. భువీ ఆ పని చేయగల సమర్థుడు కూడా..’ అని మద్దతుగా నిలిచాడు.
ఆసీస్తో తొలి మ్యాచ్లో భువీ.. 19వ ఓవర్లో 16 రన్స్ ఇచ్చాడు. మొత్తంగా మొహాలీలో అతడు 4 ఓవర్లలో 52 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో 19వ ఓవర్లో 16 రన్స్, శ్రీలంకపై 14 రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో భారత్ కీలక మ్యాచ్లలో ఓడిపోక తప్పలేదు.