Maruti Suzuki | న్యూఢిల్లీ, మే 9: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా నూతన జనరేషన్ స్విఫ్ట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు రూ.6.49 లక్షల నుంచి రూ.9.64 లక్షల గరిష్ఠ ధరల్లో లభించనున్నది. నాలుగు విభాగాల్లో లభించనున్న ఈ కారు ఎల్ఎక్స్ఐ మాడల్ ధర రూ.6.49 లక్షలు, వీఎక్స్ఐ రూ.7,29,500 నుంచి రూ.7,79,500, వీఎక్స్ఐ(వో) ధర రూ.7.56 లక్షల నుంచి రూ.8.06 లక్షలు, జెడ్ఎక్స్ఐ ధర రూ.8,29,500 నుంచి రూ.8,79,500 విక్రయిస్తున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఎండీ, సీఈవో హిసాషీ తకేచి మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఎంట్రీ లెవల్ కార్లకు భవిష్యత్తులోనూ డిమాండ్ ఉంటుందని, మొత్తం వాహన విక్రయాల్లో వీటి వాటా 28 శాతంగా ఉండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ తయారు చేయడానికి సంస్థ రూ.1,450 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్లో ఏటా 7 లక్షల ప్రీమియం హ్యాచ్బ్యాక్ కార్లు అమ్ముడవుతుండగా, 2030 నాటికి 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. అలాగే ఈ మాడల్ నెలవారి సబ్స్క్రిప్షన్తో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.