Srisailam | లోక క్షేమాన్ని ఆకాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డిదంపతలు, ఈవో లవన్న దంపతలు, ధర్మకర్తల మండలి సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు చేశారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు.
ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు. అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు.
దేశ ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.