వాషింగ్టన్ : అమెరికా వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్స్ వద్ద మళ్లీ కలకలం రేగింది. చెక్పోస్ట్ వద్ద వేగంగా దూసుకువచ్చిన ఓ కారు బారికేడ్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం కారులో నుంచి వచ్చిన దుండగుడు పోలీస్ అధికారిని కత్తితో పొడిచాడు. వెంటనే స్పందించిన క్యాపిటల్ హిల్స్ పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. గాయపడ్డ పోలీస్ అధికారులను హాస్పిటల్కు తరలించారు.
అక్కడ ఎవాన్స్ అనే పోలీస్ అధికారి మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతున్నారని యాక్టింగ్ చీఫ్ యోగానంద పిట్ మన్ తెలిపారు. దుండగుడు ఇండియానాకు చెందిన ఓ నల్లజాతీయుడని, ఇస్లాం ఉద్యమానికి కట్టుబడి ఉన్న నోహ్ గ్రీన్గా యూఎస్ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రవాదులకు సంబంధముందని భావించట్లేదని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ రాబర్ట్ కాంటె పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఘటనతో క్యాపిటల్ హిల్స్ భవనాన్ని మూసివేశారు.
క్యాపిటల్ వద్ద దాడిలో భద్రతా అధికారి విలియమ్ ఎవన్స్ మృతి చెందడంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిలో మృతి చెందిన పోలీసుకు సంతాపం ప్రకటించారు. క్యాపిటల్, అక్కడ పనిచేసేవారు, దాన్ని సంరక్షించేవారికి ఇదో గడ్డుకాలమని బైడెన్ వ్యాఖ్యానించారు. దాడిపై సత్వరం స్పందించిన క్యాపిటల్ పోలీసులు, నేషనల్ గార్డ్ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాణాలు కోల్పోయిన అధికారికి సంతాప సూచకంగా శ్వేతసౌధంలో జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 6 వరకు శ్వేతసౌధంలో జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. పోలీసు అధికారి విలియమ్ ఎవన్స్ మృతిపై యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మృతి చెందిన పోలీసుకు సంతాపం ప్రకటించారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాది జనవరి 6న మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్స్ భవనంలోకి చొచ్చుకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ సమావేశమైన సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున చొచ్చుకురావడంతో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలోనూ ఓ పోలీస్ అధికారితో పాటు పలువురు మృతి చెందారు. అనంతరం క్యాపిటల్ హిల్ భవనాన్ని అధికారులు మూసివేడంతో పాటు లాక్డౌన్ విధించారు. భారీగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ను మోహరించారు. ఇటీవల కొంత సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.