మహబూబాబాద్ రూరల్, జనవరి 11: భార్యతో గొడవ కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను పొట్టన పెట్టుకున్నాడు ఓ కిరాతకుడు. వారిని బావిలోకి తోసి హత్య చేసి ఆపై తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గడ్డిగూడేనికి చెందిన భూక్యా రామ్కుమార్, శిరీష దంపతులు. వీరు పదేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత ఏడాదికి రామ్కుమార్కు సీఐఎస్ఎఫ్ ముంబైలో ఉద్యోగం రాగా వారు అక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు అమీజాక్సన్ (7), కొడుకు జానీబెస్టో (4) ఉన్నారు. రామ్కుమార్ రెండేండ్ల క్రితం అక్కడ ఓ బ్యాంకులో రూ.15 లక్షలు పర్సనల్ లోన్ తీసుకోవడంతోపాటు తన భార్య దగ్గర ఉన్న బంగారం సైతం తాకట్టు పెట్టాడు. జీతాన్ని ఇంట్లో ఇవ్వక వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను తరుచూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో వారు పిల్లలను తీసుకొని గడ్డిగూడేనికి వచ్చారు. మంగళవారం ఉదయం డబ్బుల విషయమై రామ్కుమార్ భార్యపై చేయిచేసుకున్నాడు. ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్తుండగా పిల్లలను తీసుకొని శిరీషను మాత్రమే పంపించాడు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలను పొలం వద్దకు తీసుకెళ్లాడు. వారితో కొద్దిసేపు ఆడుకున్నాక అక్కడి వ్యవసాయ బావిలోకి ఇద్దరిని తోసేశాడు. అక్కడినుంచి వెళ్లిన రామ్కుమార్ సాయంత్రం మహబూబాబాద్ మండలంలోని అనంతారం ప్రాంతంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బావి వద్ద నుంచి కేకలు వినపడటంతో పక్క పొలం వారు వచ్చే సరికి ఇద్దరు పిల్లలు చనిపోయి శవాలై తేలారు. మృతుడి అన్న భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.