నిజామాబాద్ క్రైం, జనవరి 10: ఓ బీజేపీ నేత వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ నిజామాబాద్కు చెందిన సురేశ్ ఓ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. విజయవాడలో మూడు రోజుల క్రితం సురేశ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడగా, అందుకు కారణాలను వెల్లడించాడు. సెల్ఫీ వీడియోలో..‘నగరానికి చెందిన బీజేపీ నాయకుడు గణేశ్ 20 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేస్తూ మమ్మల్ని తీవ్రంగా వేధింపులకు గురిచేశాడు. అతడి వద్ద తీసుకొన్న బాకీకి ఇప్పటి వరకు రూ.50 నుంచి 60 లక్షల వరకు చెల్లించాం. అయినా ఇంకా డబ్బులు కట్టాలని ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగకుండా ఇంటికి తాళం వేస్తానంటూ భయపెట్టాడు’ అని తెలిపాడు. తనకు బాకీ ఇచ్చిన మరో వడ్డీ వ్యాపారి జ్ఞానేశ్వర్ కూడా రూ.40 నుంచి 50 లక్షల వరకు వడ్డీ వసూలు చేశాడని, భార్య, పిల్లలతో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్స్, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని వేధించటంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నామని వెల్లడించాడు. 40, 50 మందితో ఇంటికి వచ్చి దాడి చేస్తామని, పరువు తీస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడని వాపోయాడు. నిర్మల్ జిల్లాకు చెందిన వినీత వద్ద అప్పు తీసుకోగా, డబ్బులు కోసం ఆమెతో పాటు ఆమె మరిది చంద్రశేఖర్ ఫోన్లు చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని, తమ చావుకు వీళ్లే కారణమని, దయచేసి వారిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో సురేశ్ కోరాడు. సెల్ఫీ వీడియో బయటికి రావటంతో విజయవాడ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. కేసును ఫార్వర్డ్ చేశాక దర్యాప్తు చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. కాగా, సురేశ్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు ముగిశాయి.