మణికొండ, ఫిబ్రవరి 23: వాహనదారులకు మరింత మెరుగైన సేవలందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆదేశించారు. మణికొండలోని రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా శాఖ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్లను మరింత పటిష్టం చేయాలన్నారు. టీ-ఆఫ్ ఫోలియో ద్వారా జరిగే ఆన్లైన్ సేవలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.
వాహనదారులు తమ సమస్యల పరిష్కారానికి ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లో ఫిర్యాదు చేస్తే.. వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎంవీఐలు సాధించిన ఆదాయ లక్ష్యాన్ని సమీక్షించారు. రహదారి భద్రతపై రాబోయే రోజుల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, మెడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల రవాణా శాఖ అధికారులు వెంకటరెడ్డి, రఘునందన గౌడ్, వాణి, సుభాష్చంద్రారెడ్డి, కిరణ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, సునిల్రెడ్డి, నవీన్, సునీత, కృష్ణవేణి, వాసు, శ్రీనుబాబు, బాబు, శ్రీరాం, రామకృష్ణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.