న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై .. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ తాను బ్రాహ్మణ కులస్తురాలు అని చెప్పుకునేందుకు మొదటిసారి ప్రయత్నిస్తున్నట్లు అధిర్ ఆరోపించారు. గతంలో ఆమె హిజబ్ ధరించినట్లు చెప్పుకునేదని, ముస్లింల రక్షణ కోసం పూజలు చేసేదన్నారు. కానీ ఇప్పుడు దీదీ మారిపోయినట్లు అధిర్ విమర్శించారు. బెంగాల్లోకి బీజేపీ ప్రవేశించిన తర్వాత.. ఆమె తనలో హిందూత్వవాదాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధిర్ తెలిపారు. బీజేపీ కన్నా హిందుత్వ వాదంలో తక్కువేమీ లేదని దీదీ నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. నిన్న ఓ సభలో మాట్లాడుతూ.. తాను చండీ మంత్రాలు చదివిన తర్వాతనే ఇంటి నుంచి బయటకు వస్తానని మమతా బెనర్జీ అన్నారు. అసలు దీదీకి మంత్రాలే రావు అని నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సువేందు అధికారి మరికొన్ని విమర్శలు చేశారు.
మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ కూడా మమతా బెనర్జీపై విమర్శలు చేశారు. కూడళ్ల వద్ద నమాజ్లకు అనుమతి ఇచ్చింది మమతా బెనర్జీ అన్నారు. దుర్గా పందిళ్లను తొలగించింది ఆమే అని ఆరోపించారు. బంగ్లాదేశ్ ముస్లింల కోసం హిందూ ధర్మాన్ని పక్కనపెట్టిందన్నారు. చాలా ఆలస్యంగా దీదీ.. చండీపాఠ్ చదవినట్లు ఆయన విమర్శించారు. మీరెప్పుడు హిందువులకు దీదీ కాలేవు, తీవ్రవాద ముస్లింలకు మాత్రమే మీరు దీదీ అంటూ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ ఆరోపించారు.