సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ గతంలో ఎన్నడూ లేనంతగా మిల్లర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు సిద్దిపేట జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఫిర్యాదుచేశారు. రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాముల కొరత అధికంగా ఉన్నదని, ధాన్యం ఉత్పత్తి పెరిగినంత నిష్పత్తిలో గోదాముల సామర్థ్యం పెంచట్లేదని ఆరోపించారు. స్టోరేజీ సమస్యలు వస్తుండటంతో వాహనాలు రోజుల తరబడి ధాన్యంతో వేచి చూడాల్సి వస్తున్నదని వాపోయారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవోలు, జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి హరీశ్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మిల్లర్లు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు పడి కొన్ని బస్తాలు తడిసినా ఎఫ్సీఐ అధికారులు వాహనాలను తిప్పి పంపుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తూకంలో హెచ్చు తగ్గులతోపాటు పురుగు పట్టాయని, ఏవేవో కారణాలు చెప్తూ లోడ్లను తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ నడుచుకోవాల్సి ఉండగా, వాటికితోడు మరిన్ని నిబంధనలు విధిస్తూ మిల్లర్లను వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎఫ్సీఐ నిబంధనలు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. వానకాలంలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు అయిన నేపథ్యంలో అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పని చేసి ధాన్యం సేకరణను విజయవంతం చేయాలని కోరారు.
నీళ్ల కోసం రైతులు ఆకాశం వైపు చూసే రోజులు పోయినయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మెతుకు సీమలో సాగు నీటి గోస తీరినదని అన్నారు. ఒకప్పుడు ప్రాజెక్టుల నిర్మాణమంటే కలగా ఉండేదని, ఆ కలలను స్వల్ప కాలంలోనే నిజం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని స్పష్టంచేశారు. తొగుట పరిధిలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును మంత్రి హరీశ్రావు శుక్రవారం సందర్శించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రాజెక్టులోకి 11 టీఎంసీల నీళ్లు వచ్చాయని, 30 మీటర్ల ఎత్తు వరకు చేరుకున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు కట్ట విస్తీర్ణం 22 కిలోమీటర్లు కాగా, 20 కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచాయని వివరించారు.