నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానవీయ కులవివక్ష ఘటన మన దేశ రాజ్యాంగ ఆత్మపై జరిగిన బహిరంగ దాడిగా చరిత్రలో నిలిచే ఘటన. భక్తి పేరుతో కూడిన వేడుకలో భక్తుడి కులం అడగడం అంటే దేవునికే కులపత్రం జారీ చేయడమే. ఇది కేవలం ఒక అవమానం కాదు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన అపరాధం.
భారత రాజ్యాంగ పీఠిక స్పష్టంగా ప్రకటిస్తున్నది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాస, ధర్మాచరణ స్వేచ్ఛ. స్థితి, అవకాశ సమానత్వం. వ్యక్తి గౌరవం, జాతీయ ఐక్యతను బలపరిచే సౌభ్రాతృత్వం ఇవే భారత గణతంత్రానికి మూల విలువలు. ఈ విలువలను ఉల్లంఘించే ప్రతి చర్యా రాజ్యాంగాన్ని అవమానించడమే. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం, చట్టాల సమాన రక్షణ ప్రతి పౌరునికి హామీ. దేవాలయ ద్వారం వద్ద కులం అడగడం, ప్రవేశం నిరాకరించడం ఈ సమానత్వ సూత్రాన్ని ఛిద్రం చేస్తున్నది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1) స్పష్టం చేస్తున్న ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా ఎటువంటి వివక్ష చేయరాదు. జాతర వంటి ప్రజా ప్రదేశంలో కులవివక్ష ఈ నిబంధనకు విరుద్ధం. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది. ఏ రూపంలోనైనా దాని ఆచరణ శిక్షార్హమైన నేరం. దేవాలయ ప్రవేశాన్ని కులం ఆధారంగా నిరాకరించడం అంటరానితనమే. ఆర్టికల్ 21 ప్రకారం జీవించుటకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతి పౌరునికి హక్కు ఉన్నది. గౌరవంతో జీవించడం ఈ హక్కులో భాగం. కులవివక్ష గౌరవ హననం. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉన్నది. దేవాలయంలో ప్రవేశం నిరాకరించడం ఈ మౌలిక హక్కును తుంచడమే. ఇన్ని రాజ్యాంగ హామీలు ఉన్నప్పటికీ, వాస్తవంలో వెయ్యికిపైగా కులవృత్తుల చేతులను సమాజం వినియోగిస్తున్నది.
మానవత్వం మంటల్లో కాలిపోతే నాగరికతకు అర్థం ఏమిటి? కుమ్మెర ఘటనపై తక్షణ చర్యలు అవసరం. అంటరానితనానికి సంబంధించిన నేరాలపై కఠినంగా అమలవుతున్న చట్టాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అట్రాసిటీస్ నిరోధక చట్టం సమర్థంగా అమలు కావాలి. వేగవంతమైన విచారణలు జరగాలి. బాధితులకు రక్షణ, పునరావాసం, న్యాయం అందాలి. దేవాలయ పరిపాలనలో అన్ని వర్గాల ప్రతినిధిత్వం ఉండాలి. సమానత్వం, గౌరవం వంటి రాజ్యాంగ విలువలు కేవలం పాఠ్యపుస్తకాల్లోనే కాకుండా ప్రతి సమాఖ్య, వేడుక, పబ్లిక్ ప్రదేశంలో జీవించాల్సిన జీవనశైలి కావాలి. కులవ్యవస్థ పోరాటంగా మొదలైనప్పటికీ, అది సమాజంలో నిర్మాణాత్మక విధంగా మారింది. కులం అనే చీకటిని కొనసాగించాలా? రాజ్యాంగ విలువల వెలుగులో కొత్త భారతాన్ని నిర్మించాలా? మానవత్వం మంటల్లో కాలిపోకుండా కాపాడేది ఒక్కటే- సమానత్వం. అది కాపాడుకొంటేనే భావి తరాలు భద్రం.. దేశం సురక్షితం.