న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం ఆక్సిజన్, సంబంధిత పరికరాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మేజర్ పోర్ట్ ట్రస్టులు విధించే అన్ని చార్జీలు మాఫీ చేయాలని కామరాజర్ పోర్ట్ లిమిటెడ్తో సహా అన్ని ప్రధాన ఓడరేవులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పడవల్లో ఆక్సిజన్ సరఫరా సంబంధిత వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ట్యాంకులు, ఆక్సిజన్ బాటిల్స్, పోర్టబుల్ ఆక్సిజన్ జనరేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అనుబంధ పరికరాల తయారీకి వినియోగించే స్టీల్ పైపులు తదితర వస్తువులను రవాణా చేసే ఓడలకు వచ్చే మూడు నెలలు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఛార్జీలు మాఫీ చేయనున్నట్లు పేర్కొంది.
ఓడరేవుల్లో బెర్తింగ్, ఆక్సిజన్ సంబంధిత సరుకు అన్లోడ్, కస్టమ్స్, ఇతర అధికారులతో సమన్వయం, వేగంగా తరలింపు కోసం లాజిస్టిక్ కార్యకలాపాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని పోర్ట్ చైర్మన్లను కోరింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు, ఎదుర్కొనేందుకు వినూత్న పద్ధతుల్లో అన్ని చర్యలు తీసుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవికూడా చదవండి..