ముంబై : కర్నాటకలో హిజాబ్ వివాదం నడుస్తుండగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం తినాలి..ఏ దుస్తులు ధరించాలనేది ప్రజల ప్రాధమిక హక్కని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తన ఇష్టాలను ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉత్తరాదిన స్త్రీలు తమ ముఖానికి ముసుగు కప్పుకోవడం అక్కడి సంస్కృతి అని, కాషాయపార్టీ నేతలు ఆ పద్ధతిని కూడా తొలగిస్తారా అని ఆయన ప్రశ్నించారు. కమలనాధులు ఆధిపత్య రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం బాలికలు కాలేజీలకు వెళ్లి చదువుకుంటుంటే బీజేపీ నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు.
బేడీ పఢావో అనే కేంద్ర ప్రభుత్వ నినాదం బూటకమేనా అని నిలదీశారు. ఉడిపి మహిళా యూనివర్సిటీ కాలేజీలో హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలను అనుమతించకపోవడంతో ఈ ఏడాది జనవరి 1న కర్నాటకలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. అప్పటినుంచి ఈ వ్యవహారం కర్నాటకలో ప్రకంపనలు సృష్టిస్తుండగా తాజాగా హిజాబ్ రగడ హైకోర్టుకు చేరింది. ఇక ముస్లిం యువతులు ఎప్పటినుంచో హిజబ్ ధరిస్తున్నారని ఇప్పుడు దీనిపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ముస్లిం యువతులను హిజబ్ ఆధారంగా వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇది పూర్తిగా వివక్షతో కూడుకున్నదని మండిపడ్డారు.
ఏ ఒక్కరి రాజ్యాంగ హక్కును నిరాకరించడం సరైంది కాదని అన్నారు. ముస్లిం యువతులను హిజబ్ ధరించకుండా మీరు ఎలా వేరుచేస్తారని ఆయన ప్రశ్నించారు. బేటీ బచావో..బేటీ పఢావో అని బీజేపీ నినదిస్తుండగా అసలు హిజబ్ వ్యవహారంలో మహిళా సాధికారత ఎక్కడ ఉందని ఓవైసీ ఓ వార్తాచానెల్తో మాట్లాడుతూ అన్నారు. ముస్లిం బాలిక ఇంటి నుంచి కాలుబయట పెడితే హిజబ్ ధరిస్తుందని, అనూహ్యంగా వీరికి కాషాయ కండువాలు ఎవరిస్తున్నారని అన్నారు. కాషాయ శాలువాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఓవైసీ నిలదీశారు. హిజబ్ వ్యవహారంపై కర్నాటక ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. ముస్లిం బాలికలను హిజబ్ ధరించకుండా అడ్డుకోవడం వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆక్షేపించారు. హిజబ్పై బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు.