Gramheet | మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా.. రైతు ఆత్మహత్యల రాజధాని. ఏ గడపను కదిపినా అన్నదాతల ఆత్మహత్యల గురించి కథలు కథలుగా చెబుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో.. పెట్టుబడి లేక, గిట్టుబాటు ధర రాక.. మౌలిక వసతులు సరిపోక.. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి నిరుపేద రైతు కుటుంబాల నుంచి వచ్చిన దంపతులు ‘ఫోర్బ్స్ ఆసియా-100’లో చోటు సంపాదించారు. ఇది వారి సొంత వ్యాపారాలకు వచ్చిన గుర్తింపు కాదు.. అక్కడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. దళారులు లేని వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు లభించిన గౌరవం.
ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తు.. దాన్ని మార్కెట్లో అమ్ముకోవడం మరో ఎత్తు. కారణం దళారులు. రాబందుల్లా పంటపై పాగావేసి.. అందినకాడికి దోచుకెళ్తుంటారు. రైతన్నల చెమట చుక్కలను, రక్తాన్ని.. జలగల్లా పీల్చేస్తారు. అలాంటి పరిస్థితులను రూపుమాపేందుకు పుట్టుకొచ్చిందే ‘గ్రామ్హిత్’. ఈ వేదిక ఫోర్బ్స్ ఆసియా-100లో చోటు దక్కించుకుంది. ఈ గుర్తింపు వెనుక పంకజ్ మహల్లే, శ్వేతా ఠాక్రే దంపతుల కృషి ఉంది. రైతుల కన్నీళ్లను ఆనందబాష్పాలుగా మార్చిన తెగువ ఉంది. ‘సిస్కో గ్లోబల్ ప్రాబ్లమ్ సాల్వర్ ఛాలెంజ్’లో విజేతగా నిలిచి పదివేల అమెరికన్ డాలర్లనూ సొంతం చేసుకుంది గ్రామ్హిత్. యావత్మల్ జిల్లాలో మొదలైన అగ్రిటెక్ విప్లవాన్ని.. దేశమంతా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పంకజ్ – శ్వేత.
గ్రామ స్థాయిలోనే రైతుల సమస్యలకు అడ్డుకట్ట వేసే వ్యవస్థ గ్రామ్హిత్. ‘ఫార్మర్-ఫస్ట్’ విధానం ద్వారా స్థానిక రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి తమ గోదాములో భద్రపరుస్తారు. ఇదొక గ్రామీణ వ్యాపార కేంద్రం. రైతులు కూడా ఇక్కడ తమ ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఫలితంగా, ఫుడ్గ్రెయిన్స్ క్వాలిటీ అనాలిసిస్ ల్యాబ్ నుంచి ఓ డిజిటల్ రసీదు అందుతుంది. దీన్ని తనఖా పెడితే రైతుల తక్షణ అవసరాలకు.. తాత్కాలిక రుణాలు కూడా ఇస్తారు. ఆ రసీదు సాయంతో మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు. గ్రామ్హిత్కు ఓ యాప్ కూడా ఉంది. ఒక్క క్లిక్తో పంట విక్రయించవచ్చు. వ్యాపారులే వచ్చి గోదాములోని సరుకును తీసుకెళ్తారు. అలా దళారుల వ్యవస్థను ఆదిలోనే తుంచేసింది గ్రామ్హిత్. యాప్ ద్వారా క్లీనింగ్, గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకేజింగ్ సేవలు కూడా బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తుంది.
‘మావి సన్నకారు రైతు కుటుంబాలు. వడ్డీకి డబ్బులు తెచ్చి వ్యవసాయం చేసేవారు అమ్మానాన్నలు. అయినా రాబడి అంతంతమాత్రమే. నేను, శ్వేత రైతు ఉద్యమాల్లో కలిసి పోరాటాలు చేశాం. నేను కొంతకాలం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేశాను. శ్వేత హైదరాబాద్ ఐఐటీలో చదివింది. రైతుల సమస్యలకు పరిష్కారం వెతకాలనే లక్ష్యంతో ఉద్యోగాలు వదులుకొని గ్రామ్హిత్ను ప్రారంభించాం. అది విజయవంతమైంది’ అంటున్నాడు పంకజ్.
‘మనదేశంలో రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. ధాన్య విక్రయం. ఈ దశలో దళారుల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. పెరిగిన ఖర్చులతో.. పెట్టుబడి పైసలు కూడా వెనక్కి వచ్చే పరిస్థితులు లేవు. మంచిధర దక్కే వరకూ నిల్వ చేసుకునే వెసులుబాటు లేదు. దీంతో చచ్చినట్టు అమ్మాల్సి వస్తున్నది. ఆ చిల్లర డబ్బు వడ్డీలకూ సరిపోవడం లేదు. అప్పులు, వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు.. మొత్తంగా రుణాల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. ఆ అగాథాన్ని పూడ్చడానికే గ్రామ్హిత్ పుట్టుకొచ్చింది’ అని వివరిస్తాడు పంకజ్. దేశంలో సన్నకారు రైతులు 12 కోట్లదాకా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే, గ్రామ్హిత్ కాన్సెప్ట్ను దేశమంతా విస్తరించాలని చూస్తున్నాడు. ఐదు ఎకరాలలోపు రైతులకు మౌలిక వసతులు కల్పించి, మెరుగైన ధర వచ్చినప్పుడే విక్రయించుకునే ఏర్పాట్లు చేయాలన్నది పంకజ్, శ్వేత దంపతుల లక్ష్యం.
“రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”