ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో యాదాద్రి ప్రధానాలయాన్ని సువిశాలంగా, మహాద్భుతంగా పునర్నిర్మించారు. ఒక్కో నిర్మాణం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శిల్ప కళ నుంచి భక్తుల వసతులకు వరకు ప్రతి ఒక్కటీ ఆధ్యాత్మిక ఉట్టి పడేలా నిర్మాణాలు ఉన్నాయి.
యాదాద్రి కొండపై 17. 32 ఎకరాల్లో ఆలయ పునర్నిర్మాణాలను చేపట్టారు. 4.30 ఎకరాల్లో స్వామివారి ప్రధానాయాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ ప్రహరీ సైతం నిర్మించారు. పడమర దిశలో 125 మీటర్ల పొడవు, 50 ఫీట్ల ఎత్తు, దక్షిణ భాగంలో 215 మీటర్ల పొడవు, 100 ఫీట్ల ఎత్తు, ఉత్తర భాగంలో 215 మీటర్ల పొడవు, 20 ఫీట్ల ఎత్తుతో ప్రహరీ నిర్మించారు. ఉత్తర భాగంలో ప్రహరీ పక్కన 330 పొడవు, 43 వెడల్పులో గార్డెన్ నిర్మించగా పూల మొక్కలు, పచ్చని గడ్డి ఆహ్లాదాన్ని పంచనుంది.
13.02 ఎకరాల్లో శివాలయం, ప్రసాద విక్రయశాల, ఎస్కలేటర్తో కూడిన మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్, విష్ణు పుష్కరిణి నిర్మించారు. ఆ పక్కనే బస్బే, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూం, స్వాగత ఆర్చీతోపాటు మెట్ల నిర్మాణం చేపట్టారు. ప్రధానాలయం పడమర భాగంలో వీవీఐపీ అతిథి గృహం, ఈఓ కార్యాలయం, కారు పార్కింగ్, వీవీఐపీ పార్కింగ్ నిర్మించారు. గతంలో కేవలం 1.30 ఎకరాల్లో ఉన్న యాదాద్రీశుడి ఆలయం ప్రస్తుతం 4.30 ఎకరాలకు పెరిగింది.
పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించారు. బాహ్య ప్రాకారంలో తిరు మాఢవీధులతోపాటు తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురంతోపాటు త్రితలం, విమాన గోపురాలను కృష్ణశిలలతో మహాద్భుతంగా తీర్చిదిద్దారు. గతంలో ప్రాకారాలు లేని ఆలయానికి ఇప్పుడు బాహ్య, అంతర ప్రాకారాలు నిర్మించారు. యాళీ పిల్లర్లతోపాటు అష్టభుజి మండపాలతో ప్రధానాలయం కనువిందు చేస్తున్నది. స్వామివారికి ప్రత్యేక రథశాల, ఆ పక్కనే లిప్టు, పడమర ప్రాంతంలో తిరుపతి తరహాలో వేంచేపు మండపం, తూర్పు ప్రాంతంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. గర్భాలయంలో నిలువెత్తు ఆళ్వారులు, స్వర్ణకాంతులతో తీర్చిదిద్దిన ముఖ మండపం భక్తులను ఆకట్టుకోనున్నాయి.
గతంలో యాదాద్రి ఆలయం 12 ఎకరాల్లో ఉండేది. ఇందులో తూర్పు, పడమర గోపురాలతో ప్రధానాలయం, దక్షిణ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం ఉండేది. దీనిని క్యూ కాంప్లెక్స్, కల్యాణ మండపానికి వినియోగించేవారు. ఉత్తరం వైపు క్యూ లైన్ ఉండేది. తూర్పు ప్రాంతంలో రూ.100 క్యూ లైన్తోపాటు ప్రసాద విక్రయశాలకు వాడేవారు. వీటితోపాటు కల్యాణ మండపం, ఎదుర్కోళ్ల మండపం, అద్దాల మండపం, సత్యనారాయణ వ్రత మండపాలు నిర్వహించారు. పుష్కరిణి పక్కనే కల్యాణ కట్ట ఉండేది. పడమర, ఉత్తరం వైపు వసతి గృహం, వీఐపీ అతిథి గృహం ఉండేవి. అప్పటి ప్రధానాలయం 1.30 ఎకరాల్లో ఉండగా తిరు మాఢవీదులు కొన్ని పాంత్రాలకు పరిమితమై ఉండేవి.
చక్కటి ఆకృతులు, స్వర్ణ వర్ణాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా క్యూలైన్లు నిర్మించారు. ప్రధానాలయం తూర్పు రాజగోపురం ఎదుట ప్రహరీ పక్కన క్యూలెన్లు బిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా క్యూలెన్లను బంగారు వర్ణంతో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. తక్కువ బరువు, వేసవిలో సైతం సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉండేందుకు అల్యూమినియం ఎల్ఎన్6 గ్రేడ్ను వినియోగించారు. యాదాద్రి మాఢ వీధిలో నుంచి బ్రహ్మోత్సవ మండపం పక్క నుంచి స్వామి వారి ముఖ మండపం వరకు 301 ఫీట్ల పొడవు, 8-6 ఫీట్లు వెడల్పు, 10- 12 ఫీట్ల ఎత్తులో క్యూలైన్లు బిగించారు. క్యూలైన్లకు శంకు, చక్ర, నామాలు, ఐరావతాలు, దేవతామూర్తుల రూపాలను పొందుపరిచారు. బ్రహ్మోత్సవ మండపం పక్క నుంచి నేరుగా దక్షిణ ప్రాంతంలోని బయట మండపం, అక్కడి నుంచి తూర్పు పంచతల రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలెన్లను ఏర్పాటు చేశారు.
1959లో ఇక్కడ మహాయాగం నిర్వహించి లక్ష్మీదేవి మందిరం, తూర్పు రాజగోపురాలను నిర్మించారు. రానురాను పెరుగుతున్న భక్తుల రద్దీకి తగినట్టుగా నాటి పాలకులు యాదగిరి గుట్టపై సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా ఆలయం అభివృద్ధిని పట్టించుకున్న వారే లేరు. పురవీధులు లేని స్వామివారి ఆలయం, సిమెంటుతో నిర్మించిన గోపురాలు, భక్తుల రద్దీ పెరిగితే నిల్చునేందుకు సైతం స్థలం ఉండేది కాదు. నిరాదరణకు గురైన ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంకల్పించి పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు.
గతంతో ఉత్తర ద్వారం లేకపోవడంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన తూర్పు ద్వారాన్నే ఉపయోగించేవారు. ప్రస్తుతం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయ పునర్నిర్మాణంతో ముక్కోటి దర్శన భాగ్యాన్ని ఉత్తర నుంచి చూసుకునే వీలు కలిగింది. ఉత్తర ద్వారం ఇరువైపులా నాలుగు అడుగుల ఎత్తున రెండు సింహాల ప్రతిమలను ప్రతిష్ఠించారు. ఈ ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తీస్తారు. మాఢ వీధుల్లో ఊరేగించే స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి, దక్షిణ ద్వారం నుంచి లోపలికి తీసుకురావడం ఉండదు. తూర్పు, పశ్చిమ రాజగోపురాల నుంచే స్వామి వారిని గర్భాలయానికి తీసుకొస్తారు.
దాదాపు రూ.1200 కోట్ల ఆంచనా వ్యయంతో యాదాద్రి ఆలయ నిర్మాణాలు చేపట్టగా రూ.1,058 కోట్లతో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో పంచ నారసింహుడి క్షేత్రం భక్తులకు చేరువ కానుంది. భక్తజన బాంధవుడైన యాదగిరీశుడి గర్భాలయ వాకిట ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి కిరణాలు పడేలా ఆలయాన్ని నిర్మించారు.