తిమ్మాజిపేట, మార్చి 7 : వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న ఆదాయం, కోల్పోతున్న భూసారం వంటివి ఓ వ్యక్తి ఆలోచనా విధానాలను మార్చేశాయి. కొన్ని దశాబ్దాల కిందట ఉన్న సాగు విధానాలపై దృష్టి మరల్చాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నాడు. తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన బైరపాగ రాజుకు ఎనిమిది ఎకరాలు ఉన్నది. 2011లో ఉపాధి కోసం హైదరాబాద్కు వలసవెళ్లాడు. 2013లో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అదే ఏడాది భూత్పూర్లో పాలేకర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లి ప్రకృతి సాగుపై అవగాహన పెంచుకున్నాడు.
ఒకటి, రెండు ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేసి.. స్వయంగా విత్తనాలు సమకూర్చునే పాత పద్ధతిని అవలంబించాడు. 2015లో హైదరాబాద్లో వారణాసి ప్రకాశ్సింగ్ నిర్వహించిన సమావేశంలో పాల్గొని పూర్తిగా ప్రకృతి సాగు వైపు దృష్టి మరల్చాడు. రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకంతో భూసారం తగ్గుతుందని, మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించి.. ఇంట్లోనే సహజ ఎరువుల తయారీ ప్రారంభించాడు. సహజ సిద్ధమైన ఎరువులు, కషాయాలు వాడితే భూమిలో ఎనిమిది రకాల పోషకాలు అభివృద్ధి చెందుతున్నాయంటున్నాడు.
ఇప్పటికే 500 రకాల పలు విత్తనాలను సిద్ధంగా ఉంచుకున్నాడు. ఘన జీవామృతం, జీవామృతం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, దశకర్ణి కషాయం, పంచగవ్య కషాయం, చాపల కషాయం ఇంటి వద్దే తయారీ చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఎనిమిది ఎకరాల్లో వరి, మచ్చ కందులు, వేరుశనగ, జొన్నలు సాగు చేస్తున్నట్లు రాజు తెలిపారు. తాను పండించిన పంటలను ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారన్నారు. కాగా, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాజుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు వరించాయి.
2018లో యునివర్సిటీ ఐసీఆర్ పురస్కారం, 2020లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు, 2021 ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు పురస్కారం, 2021 అక్టోబర్లో గన్నవరంలో ఉమ్మడి రాష్ట్ర ఉత్తమ రైతు పురస్కారం, నాగర్కర్నూల్ జిల్లా ఉత్తమ రైతు పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) 2022 పురస్కారం వరించింది. వ్యవసాయం రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. శుక్రవారం ఢిల్లీలో అవార్డు అందుకోనున్నాడు.