మహబూబ్నగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని ఒప్పించలేని తెలంగాణ బీజేపీ నేతలు తమ తప్పు బయటపడకుండా ఇక్కడి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరి కొనుగోలు చేసేలా చూడాల్సిందిపోయి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టబోమని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. కొనుగోలు విషయంలో పంజాబ్కు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే శుక్రవారం జరిగే ధర్నాను విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. స్వచ్ఛందంగా రైతులు పెద్దఎత్తున భాగస్వామ్యం ఉండాలని కోరారు. కేంద్రం కుటిల నీతిని, బీజేపీ దుష్ప్రచారాన్ని పల్లెపల్లెకూ తెలియజేసెలా ఆందోళన చేపట్టనున్నారు. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు, ఆయా నియోజకవర్గాల్లోని రైతుబంధు సమితుల ప్రతినిధులు, రైతులు నిరసన ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ప్రత్యేకించి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుడు మాటలను కర్షకులు ఎండగట్టేందుకు రెడీ అయ్యారు.
గందరగోళానికి గురిచేస్తూ..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను గందరగోళానికి గురి చేస్తున్నదని టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మోడీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు. స్థానిక బీజేపీ నాయకత్వం తీరు చూస్తుంటే రాష్ర్టానికి అన్యాయం జరిగినా పర్వాలేదు అన్నట్లు ఉన్నదన్నారు.నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు సమైక్య రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ రైతులు ప్రస్తుతం కాలం కలసొచ్చి.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాగునీరు పుష్కలంగా అందిస్తుంటే పంటలు బాగా పండించుకుంటున్నారు. పంటలు చేతికొచ్చినా కొనుగోలు విషయం తేల్చకుండా కేంద్రం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు నాయకులు దరఖాస్తు చేసి అనుమతి పొందారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తా నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్డివో కార్యాలయం, నారాయణపేటలోని అంబేద్కర్ చౌక్ వద్ద, నాగర్కర్నూల్లోని జెడ్పీ మైదానంలో ధర్నాలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.