జడ్చర్లటౌన్, నవంబర్ 11 : మహిళలు స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని లయన్స్ క్లబ్ భవనంలో మన సేవాసమితి, లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుట్టుశిక్షణలో నైపుణ్యం పెంచుకొని స్వయం ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి జీవనోపాధి కల్పించాలని తెలిపారు. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు స్వయం ఉపాధి ఎంతో దోహదం చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, లయన్స్ క్లబ్ జోనల్ అధ్యక్షుడు ప్రవీణ్, అధ్యక్షుడు సుదర్శన్, బాద్మి రవిశంకర్, యాదయ్య, మెడిశెట్టి రామకృష్ణ, మురళి, మన సేవాసమితి అధ్యక్షుడు వేణు, రవీందర్రెడ్డి, రఘు, రాధాకృష్ణ, బాలమణి, టీఆర్ఎస్ నా యకులు సతీశ్, శ్రీకాంత్, ఇంతియాజ్, రమేశ్, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్నాను విజయవంతం చేయాలి
జడ్చర్ల, నవంబర్ 11 : ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ధర్నాకు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, రైతులు తరలిరావాలని కోరారు.