మహబూబ్నగర్, నవంబర్10 : ఆడపిల్లలపై సమాజ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ.సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో మహిళా సాధికారత, గృహహింస, మహిళా ఉద్యోగినులు, పనిచేసే చోట లైంగిక వేధింపులు అనే అంశంపై నిర్వహించిన సెమినార్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడ, మగ అంటూ బేధాభిప్రాయం చూపిస్తూ పిల్లలను పెంచకూడదని, సమాన హక్కులను కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, గృహ హింస నిరోధం, భార్యాభర్తల వివాదాలు, యుక్తవయస్సులో యువతకు ఎదురయ్యే ప్రేమ, టీజింగ్ వంటి సమస్యలను సఖి ద్వారా ముందుగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా న్యాయం కోసం ఆర్థికంగా అడ్వకేట్ను నియమించుకోలేని వారికి డీఎల్సీఏ ద్వారా ఉచితంగా న్యాయ సాయం కోసం లాయర్ను ఏర్పాటు చేయించాలన్నారు. పోక్సో కేసులను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషన్ మహిళలకు రక్షణ, హక్కులపై అవగాహన కల్పించడంతోపాటు అండగా నిలుస్తుందన్నారు. పనిచేసే చోట ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎవరికి వారు మౌనంగా ఉంటూ అవమానాలను భరించకూడదని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని సంస్థ రూపొందించిన ‘ఆడపిల్లల లోటు -సమాజానికి చేటు’ అనే కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. అలాగే సమాచార శాఖ ఆధ్వర్యంలో పోషణ్ మహా, మహా ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకించారు. అంతకుముందు చైర్పర్సన్కు కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మెట్టుగడ్డలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ఆమె సందర్శించారు. గృహంలోని భోజన, మహిళలకు కల్పిస్తున్న సదుపాయాలను తనిఖీ చేశారు. మరింత రుచిగా భోజనాలు వండాలని సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం సఖి కేంద్రాన్ని సందర్శించి మహిళలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రంతోపాటు వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సఖి మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని తెలిపారు. కార్యక్రమాల్లో మహిళా కమిషన్ సభ్యులు సాహీన్ ఆఫ్రిది, కే.ఉమాదేవి, జీ.పద్మ, రేవతి, ఆర్డీవో పద్మశ్రీ, డీడబ్ల్యూవో రాజేశ్వరి, డీవీసీఎల్ జిల్లా కోఆర్డినేటర్ అరుణ, అడ్వకేట్ రవికుమార్ యాదవ్, ఏపీడీ శారద, నాగరాణి, డీఆర్డీవో యాదయ్య, జెడ్పీ ఇన్చార్జి సీఈవో మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.