మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరి ఉరిగా మారింది. కేంద్రం కొనబోమంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్నా ఇన్నాళ్లు కొంటూ వచ్చింది. చివరికి వరి నిల్వలు పెరిగాయి. ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతోపాటు వరి సాగు కోసం అధికంగా ఎరువులు వాడడంతో భూములు సా రం కోల్పోతున్నాయి. భవిష్యత్లో వరి పం డించే భూములు వ్యవసాయానికి పనికి రా కుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వరి తప్పా వేరే పంట పండని పరిస్థితి ఉన్న చోట వదిలే సి మిగతా చోట్ల మాత్రం తప్పనిసరిగా పంటల మార్పిడి చేయాలని సూచిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల రైతుల నుంచి ఊహించని స్పందన వస్తున్నది. నారాయణపేట జిల్లా నర్వ మండలం బెక్కెరపల్లి గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో రైతులు మినుముల పంట వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. కె.వెంకటన్న మొ దట మినుములు వేసి లాభాలు ఆర్జించగా.. ఆయనను చూసి మిగతా వారు సైతం అదే బాట పట్టారు. వరితో తమకు పెద్దగా ఒరిగేదేమీలేదన్న సత్యాన్ని అర్థం చేసుకున్న బెక్కెరపల్లి రైతులు క్రమంగా పంట మార్పిడికి అలవాటు పడుతున్నారు.
వరి వద్దు.. మినుములు ముద్దు..
ఎకరాలో వరి సాగు చేసేందుకు 1,200 మిల్లీమీటర్ల నీరు కావాలి. మినుములకు మాత్రం 400 మి.మీ. సరిపోతుంది. మినుములకు ఎకరాకు పెట్టుబడి రూ.12 వేలకు మించదు. 7 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. క్వింటాకు సుమారు రూ.8 వేలు వేసుకున్నా.. రూ.56,000 వస్తుంది. అయితే ఎకరా వరి సాగుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల పెట్టుబడి అవుతుంది. 20 క్వింటాళ్ల పంట వచ్చినా మార్కెట్ రేటు ప్రకారం (రూ. 1,400) అయితే రూ.28 వేలు వస్తుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించినా రూ.39,200 వస్తుంది. ప్రస్తుతం కేంద్రం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొంటున్నది. భవిష్యత్లో కొనబోమని కచ్చితంగా చెప్పేసింది. ఈ తరుణంలో రానున్న రోజుల్లో వడ్లకు ప్రస్తుతం ఉన్న విధం గా ధర వచ్చే అవకాశమే లేదు. ఈ తరుణంలో రైతులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ సాగుకు అలవాటు పడాలి.
మినుములతో లాభాల పంట..
మినుములు సాగు చేయడం వల్ల భూమి సారవంతమవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పొలంలోని రూట్ నాడ్యూల్స్ గాలిలోని నత్రజనిని తీసుకొని వేళ్లను స్థిరీకరిస్తాయి. పంట చేతికొచ్చిన తరువాత వేళ్లు భూమిలోనే ఉండడంతో నత్రజని మిగిలిపోయి భూమి సారవంతమవుతుంది. అలాగే మినుమలకు ఆకురాల్చే గుణం ఎక్కువ. దీని వల్ల భూమికి సహజ సిద్ధంగా సేంద్రియ పదార్థాలు లభిస్తాయి. గతంలో సంప్రదాయంగా పండించే మినుముల్లో పల్లాకు తెగులు ప్రధాన స మస్యగా ఉండేది. ఇప్పుడు ఈ తెగులును తట్టుకునే రకాలు వచ్చా యి. టీబీజీ 104 రకం విత్తనాల ను నాటితే పల్లాకు తెగులు అస్సలు రాదు. చాలా ఏళ్ల తర్వాత మన ప్రాంతం లో మినుములు అధికంగా సాగుచేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
కేవలం 80 రోజుల పంట..
మినుము పంట 75 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. వ రికి 120 నుంచి 135 రోజులు పడుతుంది. రైతుకు పంటల మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. మినుములు పంట అయిపోయిన తర్వాత నువ్వులు వేసుకుంటే కేవలం 65 రోజుల్లో చేతికొస్తుంది. ఎకరాకు కనీసం రెండున్నర క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ.10 వేల ప్రకారంగా అయినా రూ.25 వేల వరకు వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రూ.10వేలు ఖర్చులు పోయినా రూ.15 వేలు లాభం. ప్రధానంగా పంట మార్పిడితో భూమి సారవంతంగా మారుతుంది. పంట దిగుబడులు బాగా పెరుగుతాయి. మినుములతో పాటు నువ్వులు, పెసర, కొర్రలు వంటి వాటితో పంటల మార్పిడి చే యొచ్చు. అయితే చౌడు భూముల్లో మాత్రం ఈ పంటలు పం డే పరిస్థితి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
వరితో భూమి పాడవుతుందిలా..
వరి సాగుతో భూములు క్రమంగా పనికిరాకుండా పోతాయ ని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరిగెట చేయడం వల్ల భూ మిలో గట్టి పొర ఏర్పడుతుంది. ఈ పొర వేరే పంటలు వేసేందుకు అనకూలంగా ఉండదు. పంట మార్పిడి కష్టమవుతుంది. ఆ భూమిని ఆరుతడి పంటలకు సిద్ధం చేయాలంటే ఖర్చు భా రీగా పెరిగి నష్టపోతారు. వరిలో ఎక్కువగా రసాయనాలు వా డుతారు. పర్యవసానంగా భూములు చౌడు బారుతాయి. కృష్ణా మండలంలో ఎకరాకు 8 నుంచి 14 సంచుల ఫర్టిలైజర్లు వాడు తున్నారు. దీంతో భూమి నిర్జీవమవుతుంది. కెమికల్స్ ఎక్కువగా వాడడంతో గ్రీన్ హౌజ్ వాయువులు బయటకు వస్తాయి. దీంతో పర్యావరణం దెబ్బతింటుతుంది. ఓజోన్ పొరకు ప్రమా దం ఏర్పడుతుంది. బోర్లు, బావుల కింద వరి సాగు వల్ల భూ గర్భ జలాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి సందర్భాలను కూడా దృష్టిలో ఉంచుకుంటే వరి వేయకుండా ఆరుతడి పంటలకు మారడం అత్యుత్తమని అధికారులు చెబుతున్నారు.
గతంలో ఆరుతడి పంటలే ఎక్కువ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో వ్యవసాయం కోసం బావులు, బోర్లపై ఆధారపడేవా రు. క్రమంగా నీటి లభ్యత పెరగడంతో వరి సాగువైపు మళ్లారు. ఒకరిని చూసి మరొకరు అలా వరి వైపు వెళ్లిపోయారు. వాస్తవంగా ఆరుతడి పం టలు పండించే అవకాశం ఉన్న రైతులే ఈ ప్రాంతంలో ఎక్కువ. కానీ వరి వేస్తే సులభంగా పనవుతుందనే భావన చాలా మందిలో ఉన్నది. వరిలో పెద్దగా లాభాలు రాకపోవడంతోపాటు భూమి నిస్సారంగా మారడంతో ఇతర పంటలు పండించే అవకాశం లేకుండా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో తక్కువ వ్యవధిలో చేతికొచ్చే మినుములు, నువ్వులు, పెసర, కొర్రలు తదితర ఆరుతడి పంటలు పండిస్తే మంచి లాభాలు వస్తాయి.
కూలీల కొరతతో మినుములు వేశాం..
అందరూ ఒకేసారి వరి సాగుకు దిగడంతో కూలీల కొరత విపరీతంగా వేధిస్తున్నది. కూలీల కోసం పోటీ పడాల్సి వస్తున్నది. ఇలాం టి తరుణంలో మినుములు ఎంతో మేలని మే మూ ఈ దిశగా వచ్చాం. ఈసారి కొత్తగా మినుములు సాగు చేశాం. నేను, నా తమ్ముడి పొలం కలిపి 10 ఎకరాల్లో మినుములు పండిస్తున్నాం. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలతో సస్యరక్షణ చర్యలు చేపట్టాం. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం.