చెన్నై, జూలై :ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్సెంథిల్ కుమార్ రామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ద్విచక్ర వాహనాల అద్దాలను తొలగిస్తే వాహన వారంటీ రద్దు అవుతుందని వినియోగదారులను హెచ్చరించాలని వాహన తయారీదారులకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించింది.
ద్విచక్ర వాహనానికి మిర్రర్స్ లేకపోతే మలుపుల వద్ద వచ్చే వాహనాలను గమనించలేకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మద్రాస్ కోర్టు అభిప్రాయపడింది. తిరుచెందూర్కు చెందిన న్యాయవాది రామ్కుమార్ ఆదిత్యన్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్)పై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
కొంత మంది వాహనదారులు స్టైల్ కోసమో లేదంటే, ఇతర కారణంతోనే ద్విచక్ర వాహనాలకున్న మిర్రర్స్ తొలగిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల స్టైల్ గా ఉడొచ్చేమో కానీ, వెనుక వచ్చే వాహనాలను గుర్తించలేరు కావున ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ న్యాయవాది రామ్కుమార్ ఆదిత్యన్ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. ద్విచక్ర వాహనాలపై మిర్రర్స్ తొలగించడం వల్ల మరిన్ని ప్రమాదాలు సంభవించాయని ఆయన ఆరోపించారు. అద్దాలను తొలగించే వారికి జరిమానా విధించాలని ఆయన అభ్యర్థించారు.