కట్టంగూర్, మే 02 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్ రావు అన్నారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో శనివారం బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. లారీల కొరతతో కొనుగోలు నిలిచిపోవడంతో ఎర్రని ఎండలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని ఆవేవన వ్యక్తం చేశారు.
కేంద్రాల్లో కనీస సౌకర్యాలు నిర్వాహకులు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్ కుమార్, జిల్లా కార్యదర్శి అయిటి చిరంజీవి, ఉపాధ్యక్షులు గజ్జి రవి, వేముల శంకర్, సహాయ కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, నాయకులు సత్తిరెడ్డి, బూరుగు సత్తయ్య, నరసయ్య, లింగయ్య, పద్మారావు, అయోధ్య, సైదులు, స్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.