Landmine blast : ఛత్తీస్గఢ్ (Chhattishgarh) లో ఘోరం జరిగింది. గతంలో మావోయిస్టులు (Maoists) అమర్చిన శక్తిమంతమైన మందుపాతర (Landmine) ను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) కి చెందిన ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మందుపాతరలు తొలగించే ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఇవాళ (శనివారం) మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని కాంకేర్-నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు డీమైనింగ్, ఏరియా డామినేషన్ ఆపరేషన్లు చేపట్టాయి. అందులో భాగంగా ఛోటే బేతియా పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ బృందం మావోయిస్టులు అమర్చిన బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఒక ఐఈడీ ఊహించని విధంగా పేలింది. ఈ పేలుడులో ఇన్స్పెక్టర్ సుఖ్రామ్ వట్టి, కానిస్టేబుల్ కృష్ణ కోమ్రా, మరో కానిస్టేబుల్ సంజయ్ గఢ్పాలే అక్కడికక్కడే మృతి చెందారు.
మరో కానిస్టేబుల్ పర్మానంద్ కోమ్రా తీవ్రంగా గాయపడగా అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పట్టిలింగం స్పందించారు. ఇటీవలి కాలంలో లొంగిపోయిన మావోయిస్టులు, నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వందలాది ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేశామని చెప్పారు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఓ ఐఈడీని నిర్వీర్యం చేస్తుండగా పేలిందని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసం డీఆర్జీ దళాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
కాగా మార్చి 31న రాష్ట్రాన్ని సాయుధ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇదే మొదటి పేలుడు ఘటన కావడం గమనార్హం.