న్యూఢిల్లీ: అదానీ గ్రూపు మోసాలకు పాల్పడిన అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేపట్టాయి. లోక్సభలో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యుల్ని తమతమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని కోరారు. దేశ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని, చర్చ కావాలని ప్రజలు ఆశిస్తున్నారని, కానీ విపక్షాలు ఆందోళన చేయడం తప్పుడు విధానమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
ఆందోళనలు చేపట్టడం భారతీయ విధానం కాదన్నారు. విపక్షాల వ్యవహారం సరిగా లేదని బిర్లా ఆరోపించారు. ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. సభలో చర్చ జరగాలంటే.. ప్రశ్నోత్తరాలను కొనసాగించాలన్నారు. అయితే విపక్ష సభ్యులు ఆందోళన వీడకపోవడంతో ఆయన సభను మధ్యాహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైంది. అదానీ స్టాక్స్ అంశంపై చర్చ చేపట్టాలని, జేపీసీతో ఆ అంశాన్ని విచారించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో చైర్మన్ ధన్కడ్ కలగచేసుకున్నారు. చైర్ వద్ద లేచి నిలబడి ఆయన విపక్షాలను ఆందోళన విరమించాలని కోరారు. యావత్ దేశం మనల్ని చూస్తోందని, సభ ఆర్డర్లో లేదని, ఇది రూల్స్ను అతిక్రమించడమే అవుతుందని ఆయన అన్నారు. దీంతో సభను 2 గంటలకు వాయిదా వేశారు.