భువనగిరి: ఆదివారం హుస్నాబాద్ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. అనంతరం భువనగిరిలో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు.
తెలంగాణ ఏర్పడకముందే రైతులు ఎన్నో తిప్పలు పడ్డారని, కరెంటు లేక రాత్రిళ్లు పొలాల దగ్గర కాపుగాసి నీళ్లు పారించుకునే వాళ్లని సీఎం చెప్పారు. 24 గంటల కరెంటు వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కానీ కొందరు రైతులకు మూడు గంటల కరెంటు చాలని అంటున్నారని, వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో భువనగిరిలో 50 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలువబోతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ చెప్పారు. తమ సర్వే రిపోర్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు.
భువనగిరికి ప్రత్యేక ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు తాను ఐటీ మంత్రి కేటీ రామారావుతో మాట్లాడానన్నారు. ఎన్నికలవగానే ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి స్థానికులకు వేలల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
తాను కూడా రైతు బిడ్డనేనని, రైతుల బాధలు తనకు తెలుసని సీఎం కేసీఆర్ చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయినా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. రైతుల బాధలు తెలుసుగనుక రైతుల సంక్షేమం అన్ని విధాల కృషి చేస్తున్నానని అన్నారు.
ధరణితో రైతులకు తిప్పలు తప్పినయని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతకుముందు రైతులు భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వచ్చేదని అన్నారు. ధరణిని తీసేస్తామంటున్న వాళ్లకు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
బస్వాపూర్ ప్రాజెక్టుకు నృసింహ సాగర్ అని భగవంతుడి పేరే పెట్టుకున్నామని, ఈ ప్రాజెక్టు 98 శాతం పూర్తయ్యిందని సీఎం చెప్పారు. త్వరలో ప్రాజెక్టును పూర్తిచేసి ప్రారంభిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దయవల్లే తాను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేను అయ్యాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి చెప్పారు. భువనగిరి అభివృద్ధి మనకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వరమని అన్నారు.