మంచిర్యాల, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి త్వరలోనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశ ప్రసంగంలో ఆయన వెల్లడించారు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజల చిరకాలవాంఛ, లక్ష ఎకరాలకు సాగు నీరందించే లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలువనున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించడంతో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు విప్ సుమన్ పుష్పగుచ్ఛం అందించి చెన్నూర్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 70 ఏండ్ల చెన్నూర్ చరిత్రలో ఈ రోజు మరువలేనిది. గతంలో ఇక్కడి నుంచి గెలిచి, పెద్ద, పెద్ద పదవుల్లో ఊరేగిన నేతలెవరూ చేయలేని గొప్ప కార్యానికి ముందడుగు పడింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో సీఎం కేసీఆర్ చెన్నూర్కు మరో కానుక అందించారు. అసెంబ్లీ సాక్షిగా ఎత్తిపోతలపై ప్రభుత్వం చేసిన ప్రకటన గతంలో విమర్శలు చేసిన వారికి చెంపపెట్టులా మారింది. చెన్నూర్ భవిష్యత్ను మార్చేందుకు శ్రీకారం చుట్టి, అభివృద్ధి యజ్ఞం కొనసాగిస్తున్న సుమన్కు నియోజకవర్గ ప్రజానీకం ఎల్లవేళలా తోడుగా ఉంటున్నది. అభివృద్ధిని ప్రశంసిస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2022-23 రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగు నీరందించే ‘చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్’కు త్వరలో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ శుభ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ, మండల, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో కార్యకర్తలు, నాయకు లు, ప్రజలు సంబురాలు చేయాలి. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుతూ వేడుకలు నిర్వహించాలి. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలందరి తరపున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి ధన్యవాదాలు తెలపాలి.
– బాల్క సుమన్,ప్రభుత్వ విప్