LIC shares : భారత జీవిత బీమా సంస్థ (LIC) లో తన వాటాను తగ్గించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రకటించింది. దాంతో సంస్థ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ (Trading) ప్రారంభమైన కొద్దిసేపటికే ఎల్ఐసీ షేరు దాదాపు ఎనిమిది శాతం వరకు పడిపోయింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ఎల్ఐసీలో 6.5 శాతం వరకు వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందులో 2.5 శాతం ప్రాథమిక ఆఫర్ ఉండగా.. మరో 4 శాతం వరకు గ్రీన్షూ ఆప్షన్ కూడా ఉంది. ఈ విక్రయం పూర్తయితే కేంద్రానికి సుమారు రూ.31 వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఓఎఫ్ఎస్కు ఒక్కో షేరు కనిష్ఠ ధరను రూ.382 గా నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర కంటే దాదాపు 11 శాతం తక్కువ. దాంతో మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడి షేరు ధర క్షీణించింది. ఉదయం ట్రేడింగ్లో షేరు రూ.390.70 కనిష్ఠ స్థాయికి చేరింది.
మంగళవారం నుంచి సంస్థాగత మదుపర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి రిటైల్ మదుపర్లు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. ప్రజల వద్ద కేవలం 3.5 శాతం మాత్రమే ఉంది. ఈ ఓఎఫ్ఎస్ పూర్తయితే ప్రభుత్వ వాటా 90 శాతానికి తగ్గుతుంది. కనీస ప్రజా వాటా నిబంధనలు పాటించేందుకు 2027 మే వరకు గడువు ఇచ్చిన సెబీ ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్య చేపట్టింది.