LIC IPO | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో ముహూర్తం పక్కాగా ఖరారైనట్లు తెలుస్తున్నది. 800 కోట్ల డాలర్ల (సుమారు రూ.60 వేల కోట్ల) విలువ గల షేర్లు ఐపీవో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించే అవకాశాలున్నట్లు సమాచారం. మార్చి 11న యాంకర్ ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేయడానికి అనుమతి లభించినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. ఇతర ఇన్వెస్టర్లకు తదుపరి రోజుల్లో అనుమతి లభిస్తుందని తెలుస్తున్నది. వచ్చేనెల మొదటి వారంలో ఎల్ఐసీ ఐపీవోకు సెబీ అనుమతి రావచ్చునని భావిస్తున్నారు.
ఎల్ఐసీ ఐపీవోకు సెబీ అనుమతి ఇచ్చిన తర్వాత షేర్ విలువ ఖరారవుతుందని తెలుస్తున్నది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాల కథనం. దీనిపై స్పందించడానికి ఎల్ఐసీ నిరాకరించింది. ఆర్థికశాఖ అధికార ప్రతినిధి కూడా అందుబాటులోకి రాలేదు. గత ఆదివారం ఐపీవోకు అనుమతించాలని సెబీకి ఎల్ఐసీ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.
పాలసీదారులకు 10 శాతం షేర్లతోపాటు ఉద్యోగులకు ఐపీవో బిడ్లు దాఖలు చేయడానికి ఎల్ఐసీ అనుమతి ఇచ్చింది. సంస్థలో ఐదు శాతం వాటా అంటే 31.6 కోట్ల షేర్లను ఐపీవో ద్వారా ఎల్ఐసీ విక్రయించనున్నది. సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 100 శాతం వాటా 632 కోట్లకుపైగా షేర్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో ద్వారా ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్రం భావిస్తున్నది.