ముంబై, నవంబర్ 16: అన్నీ కుదిరితే వచ్చే నెల మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదానికి ఎల్ఐసీ ఐపీవో వెళ్లనున్నది. ఈ మెగా ఐపీవో సూపర్ సక్సెస్ కోసం వచ్చే వారం నుంచి యాంకర్ ఇన్వెస్టర్లతో బ్యాంకర్లు చర్చలు మొదలు పెట్టనున్నారని తెలుస్తున్నది. పెట్టుబడులు పెట్టగల దాదాపు 100 గ్లోబల్ ఇన్వెస్టర్లతో కూడిన ఓ జాబితాను ఇప్పటికే ఈ లావాదేవీని నిర్వహిస్తున్న 10 బ్యాంకులకు అందజేశామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆయా బ్యాంకులు సదరు ఇన్వెస్టర్లతో వచ్చే వారం నుంచే చర్చలు జరుపనున్నాయన్నారు. దీంతో ఒక్కసారి ఎల్ఐసీ విలువ ఖరారైతే.. డిసెంబర్ మొదటి వారంలో బ్యాంకులు ఎల్ఐసీ డ్రాఫ్ట్ ఐపీవో ప్రాస్పెక్టస్ను సెబీకి దాఖలు చేయాలని చూస్తున్నాయి. అయితే దీనిపై ఎల్ఐసీ ప్రతినిధిని సంప్రదించగా ఎటువంటి సమాధానం రాలేదు.
నిజానికి ఈ ఐపీవోకు అవసరమైన ఎల్ఐసీ విలువ లెక్కింపు ప్రక్రియ గత 8 నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. కాగా, దేశ చరిత్రలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ఎల్ఐసీతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. పెరిగిపోతున్న బడ్జెట్ లోటును తగ్గించేందుకు కనిష్ఠంగా రూ.40,000 కోట్లు, గరిష్ఠంగా లక్ష కోట్ల రూపాయలను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా మోదీ సర్కారు ఖజనాకు తరలించాలని చూస్తున్నది. ఇందుకోసం ఎల్ఐసీలో 5 నుంచి 10 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నది. అందుకు తగ్గట్లే ఎల్ఐసీ విలువ రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లదాకా ఉండాలని కోరుకుంటున్నది. ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ)ని కూడా కేంద్రం అనుమతించే వీలున్నది.